టీడీపీని నాశనం చేసింది చంద్రబాబే .. ఆయనే మా కింద పని చేశాడు .. ఎర్రబెల్లి సంచలనం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ గతంలో తనకింద పనిచేశారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఫైర్ అయ్యారు. మేం కాదు, ఏపీ సీఎం చంద్రబాబే మా కింద పని చేశారని ఎర్రబెల్లి అన్నారు. టీడీపీలో తానూ, కేసీఆర్ సీనియర్లమని చంద్రబాబే జూనియర్ అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
టీడీపీలో మేం సీనియర్లం .. చంద్రబాబు జూనియర్ .. ఆయనే మా కింద పని చేశాడు
వరంగల్ ప్రెస్క్లబ్లో ‘మీట్ ద ప్రెస్'లో మాట్లాడిన ఎర్రబెల్లి ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో తాను, కేసీఆర్ చంద్రబాబు కంటే ముందునుంచే పార్టీలో క్రియాశీలకంగా ఉన్నామని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు అవసరమైతే తన మామ ఎన్టీఆర్పై పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారని , ఆ విషయం చంద్రబాబుకు గుర్తులేదా అని ప్రశ్నించారు. కొంత కాలం గడిచాక చంద్రబాబు టీడీపీలోకి వస్తానంటే వ్యతిరేకించిన వారిలో కేసీఆర్, తానూ ఉన్నామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. చంద్రబాబు టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు గ్రూపు రాజకీయాల వల్లే పార్టీ నాశనమైందని , తమలాంటి వాళ్లను పార్టీలో తొక్కిపెట్టారని మండిపాటు కు గురైన ఎర్రబెల్లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించాలని చూసిన చంద్రబాబుకు ఏపీ ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని ఆయన అన్నారు.
తెలంగాణాలోనే కాదు ఆంధ్రాలోనూ టీడీపీని నాశనం చేస్తుంది చంద్రబాబే
చంద్రబాబు కాలాంతకుడు అన్న మంత్రి ఎర్రబెల్లి తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనూ టీడీపీనీ నాశనం పట్టించేదాకా ఆయన నిద్రపోడని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూపుల సంస్కృతిని పెంచి పోషించింది చంద్రబాబేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు.. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవటమే వారి కొంప ముంచిదని ఆంధాప్రాంత మంత్రులే కాదు, ప్రజలు కూడా చెబుతున్నారని అన్నారు. తాను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటే రేవంత్రెడ్డితోపాటు మరికొందరిని ఎగదోసి తమలో తమకే కొట్లాట పెట్టి పార్టీ నాశనానికి కారకులయ్యారని ఆరోపించారు. తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందన్న సంకేతాలు తమకున్నాయని ఆయన అన్నారు.ఎన్టీఆర్ సినిమాలో చంద్రబాబు పాత్ర గురించి అని అడిగిన ప్రశ్నకుసమాధానంగా.. చంద్రబాబు విలన్ అనే విషయాన్ని ఒప్పుకోనప్పటికీ టీడీపీకి తీరని నష్టం చేసింది మాత్రం ఆయనేనని చెప్పారు.
మల్కాజిగిరిలో నేను గెలవాలంటే మీ అవసరం కావాలి: వారి గడప తొక్కిన రేవంత్ రెడ్డి, ఆ నేత హామీ
కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన సంస్కృతే ఫిరాయింపులు ..
ఇక కాంగ్రెస్ పార్టీ పై మండిపడిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన సంస్కృతే ఇప్పటికీ కొనసాగుతోందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే పార్టీ ఫిరాయింపులకు రూపకల్పన చేస్తుందని ఆయన ఆరోపించారు. వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బలవంతంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎర్రబెల్లి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన సంస్కృతే నేటికీ రాష్ట్రంలో కొనసాగుతుందని ఎర్రబెల్లి తెలిపారు.