తుని హింస: చంద్రబాబు కెసిఆర్ సలహా విని ఉంటే...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సలహా విని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచార సభలో కెసిఆర్ చంద్రబాబుకు ఓ సలహా ఇచ్చారు. "నీకు 13 జిల్లాలు ఉన్నాయి, ఇటు హిందూపురం నుంచి అటు ఇచ్చాపురం వరకు ఊడ్చుకో, మాది మేం ఊడ్చుకుంటాం, నీకు అక్కడ పని చాలా ఉంది" అని కెసిఆర్ అన్నారు.
కాపు ఐక్య గర్జన జనవరి 31వ తేదీన జరుగుతున్న విషయం చంద్రబాబుకు ముందే తెలుసు. ఆ సభకు రెండు నెలల నుంచే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, దాన్ని చంద్రబాబు తక్కువగా అంచనా వేశారా, ఆయన మనసంతా హైదరాబాద్ మీదనే ఉందా అనేది ప్రశ్న.
తుని ఘటన ప్లాన్ ప్రకారమే జరిగిందా?: ఆమరణ దీక్ష యోచనలో ముద్రగడ
రెండు రోజుల పాటు గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు తుని సభ పరిణామాన్ని అంచనా వేయలేకపోయారని అంటున్నారు. హైదరాబాద్ తన మానస పుత్రిక అని, తన మనసంతా హైదరాబాద్ మీదే ఉంటుందని, తాను విజయవాడలో ఉన్నా పిలిస్తే అరగంటలో వాలుతానని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రులను గ్రేటర్ హైదరాబాదులోకి దించారు. వారంతా హైదరాబాదులో ఉండి డివిజన్లను పంచుకుని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిడిపి, బిజెపికి ఓట్లు పడేలా చేసే పనిలో మునిగిపోయారు. ఈ సమయంలో తునిలో ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన జరిగి, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.
కాపు గర్జన నేపథ్యంలో మంత్రులకు ఒక్కొక్కరికి ఒక్కో జిల్లాను అప్పగించి, కాపు సామాజిక వర్గం ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసి ఉంటే పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదేమోనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తుని ఐక్య గర్జనకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి కాపు సామాజిక వర్గం ప్రజలు తరలి వచ్చారు. దాంతో అనూహ్యంగా తుని ఆందోళనకారులతో నిండిపోయింది.