పాలేరులో పోటీకి చంద్రబాబు అనాసక్తి: అందుకేనా?
విజయవాడ: ఖమ్మం జిల్లా పాలేరు శాసనసభా నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ అనాసక్తికి గల కారణాలపై విచిత్రమైన ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తెలంగాణ టిడిపి నేతలు పాలేరు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై చర్చలు జరపడానికి శనివారంనాడు చంద్రబాబును కలిశారు. పాలేరులో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై నిర్ణయాన్ని ఆయన తెలంగాణ రాష్ట్ర కమిటికే అప్పగించారు. ఈ విషయాన్ని టిడిపిఎల్పీ నాయకుడు రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు.
నిజానికి, సంప్రదాయం ప్రకారం పాలేరులో పోటీ పడకూడదని ఆయన అభిప్రాయపడ్డారని కూడా చెబుతున్నారు. అర్థాంతరంగా కన్నుమూసిన ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులకు ఈ సీటును వదిలిపెట్టాలని ఆయన అన్నట్లు చెబుతున్నారు. అయితే, ఏకగ్రీవానికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అంగీకరించలేదు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావును టిఆర్ఎస్ నాయకత్వం తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ స్థితిలో నామా నాగేశ్వర రావును పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకత్వం ఉత్సాహం కనబరుస్తోంది. టిడిపిలో ఉన్నప్పుడు నామా, తుమ్మల వేర్వేరు గ్రూపులను నడిపారు. ఈ స్థితిలో తుమ్మలకు నామా సరైన అభ్యర్థి అని టిడిపి భావిస్తోంది.
నామా నాగేశ్వర రావు కూడా పోటీకి ఉత్సాహపడుతున్నట్లే ఉన్నారు. అభ్యర్థిపై చర్చించడానికి సోమవారం జరిగిన టిడిపి కార్యకర్తల సమావేశంలో నామా నాగేశ్వర రావు కూడా పాల్గొన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికలో సంప్రదాయాన్ని కాదని టిడిపి తమ అభ్యర్థిని పోటీకి దించింది. అయితే, టిడిపికి డిపాజిట్ కూడా దక్కలేదు.
కానీ, పాలేరులో టిడిపికి చెప్పుకోదగిన బలం ఉండడమే కాకుండా తుమ్మలకు నామా నాగేశ్వర రావు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితే ఉంది. అయితే, చంద్రబాబు మాత్రం పోటీకి అంత ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. పోటీ చేసి ఓడిపోవడమెందుకనేది చంద్రబాబు ఆలోచనగా ఉండవచ్చునని అంటున్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి చేసిన ప్రకటనను కూడా కొంత మంది ప్రస్తావిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయడానికి సంబంధించిన ఫైల్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు బల్లపై ఉందని, కెసిఆర్ సంతకం చేస్తే ఎసిబి చంద్రబాబును ప్రాసిక్యూట్ చేస్తుందని రఘువీరా రెడ్డి అన్నారు.