కేసీఆర్ ఇలా చంద్రబాబు అలా: కిషన్రెడ్డి ఆగ్రహం, నిప్పులు చెరిగిన కాంగ్రెస్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు వేర్వేరుగా సోమవారం మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు రాదని టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తాను కర్ణాటకలో బీజేపీని ఓడించామని అబద్దపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ నేతల ఆగ్రహం
విభజన హామీలపై మేము పోరాటం చేస్తుంటే టీఆర్ఎస్ నిమ్మకు నీరెత్తిందని కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ అన్నారు. హామీల గురించి అడిగితే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రా పార్టీగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు టెండర్ల కట్టబెడుతోంది ఎవరని ప్రశ్నించారు. విభజన హామీల సాధనలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీలు ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెబుతున్నా కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిలదీయడం లేదన్నారు.
వెంటనే పునర్విభజన చట్టం అమలు కోసం అసెంబ్లీ, కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వచ్చిన వాళ్లు కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారన్నారు. రిట్ పిటిషన్ పైన ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఎందుకు వేయలేదన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తోందన్నారు.
తెలంగాణలో నిజాం పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని వాపోయారు. తెరాస ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.