హైదరాబాద్లో ఉంటా, అర్ధరాత్రైనా వస్తా: చంద్రబాబు, తలసానికి చురకలు
హైదరాబాద్: టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ను ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం బేగంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగించారు.
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలో మంత్రిగా కొనుగున్న వారిని చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఒకప్పుడు బేగంపేట విమానాశ్రంలో గేటు పడితే గంటలు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందని, అలాంటిది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శంషాబాద్ విమానాశ్రయాన్ని హైదరాబాద్లో నెలకొల్పానన్నారు.
దేశ, విదేశాల నుంచి జనం ఇక్కడికి వచ్చేలా చేశానన్నారు. హైదరాబాద్లో ప్లైఓవర్లు కట్టించి, ఎంతో అభివృద్ధి చేశానన్నారు. వైద్య, విద్య రంగాల్లో ఎంతో చొరవ చూపామన్నారు. ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్కు వచ్చేలా చేశానన్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో ఆరు నెలల పాటు కర్ఫూ విధించేవారని అలాంటిది తానొచ్చిన తర్వాత మత సామరస్యాన్ని కాపాడానన్నారు.
తెలుగుదేశం పార్టీ జెండాతో గెలిచి వేరే పార్టీలో ఉంటూ మనల్నే తిడుతున్నారంటూ మంత్రి తలసానికి చురకలంటించారు. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నానన్నారు. స్వార్ధంతో కొంతమంది నాయకులు టీడీపీని వీడారన్నారు. అయినప్పటికీ కార్యకర్తల బలం మాత్రం చెక్కుచెదరలేదన్నారు.
ఒక్క నాయకుడు పోతే వంద మంది నాయకులను తయారు చేస్తానన్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ను పరిపాలించక ముందు పరిపాలించిన తర్వాత ఎలా మారిందో చూడాలన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే మొత్తం అబిడ్స్ అనేవారు. అలాంటిది హైదరాబాద్ ఆర్ధిక వ్వవస్ధనే సమూలంగా మార్చేసిన ఘనత టీడీపీదేనన్నారు.
తెలుగు వారి ఆర్ధిక వ్యవస్ద మారాలని, చదువు కోవాలంటే వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసం లేదని ఆలోచించానన్నారు. వేరే దేశాల నుంచి మన రాష్ట్రానికి విమానాలు వచ్చేవి కావని, నేను ప్రపంచ మంతా తిరిగి హైదరాబాద్ కోసం మార్కెటింగ్ చేశానన్నారు.
దేశంలోచాలా నగరాలు ఉన్నాయిని, అయితే ఏ నగరాని లేనటువంటి ఔటర్ రింగు రోడ్డుని వేశామన్నారు. 160 కిలోమీటర్ల మేరకు వేసిన రింగ్ రోడ్డు వల్ల ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మందుకు పోతున్నారన్నారు. కాలుష్యం లేకుండా చేయాలని, మూసీ ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం. అయితే ఈరోజు ఆ ప్రాజెక్టులన్నీ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు.
కొంత మంది కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్లో నాకేం పని అంటున్నారని అన్నారు. 1975లో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో పని చేసానని చెప్పిన చంద్రబాబు ఈ 35 సంవత్సరాల్లో ప్రజల కోసం ఎంతో చేశానన్నారు. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టింది మన అసెంబ్లీ క్వార్టర్స్లోనేనని, పార్టీ పెట్టింది యుగపురుషుడు ఎన్టీఆర్ అని అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, తెలుగుజాతి ఎక్కడ ఉంటే అక్కడ టీడీపీ ఉంటుందన్నారు. తెలుగు ప్రజలు ఎవరికైనా ఇబ్బంది ఉంటే అర్ధరాత్రి పిలిచినా నేను హుటాహుటిన వస్తానన్నారు. నాకు జీవితంలో భయం లేదన్నారు.
నా జీవితంలో భయం ఉందా? అని ప్రశ్నించారు. 2003లో నా మీద బాంబులు ప్రయోగిస్తే అటు ఇటు పోయాయి కాబట్టి అవేమి నన్నేమీ చేయలేకపోయాయన్నారు. ఇందిరా, రాజీవ్, సోనియమ్మకు కూడా తానెప్పుడూ భయపడలేదన్నారు. ప్రజలకు సేవ చేయాల్సినప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసం లేదని స్పష్టం చేశారు.
తాను అవినీతిపై పోరాడుతున్నానని చెప్పిన చంద్రబాబు హైదరాబాద్ నా మనసుకు దగ్గరగా ఉండే నగరమన్నారు. హైదరాబాద్ కోసం పైళ్లు చంకలో పెట్టుకుని ఆఫీసు, ఆఫీసుకు వెళ్లి పెట్టుబడులు పెట్టాలని అడిగానన్నారు. ఢిల్లీకి వెళ్లి బిల్స్ గేట్స్ను కలిశానన్నారు. మైక్రోసాప్ట్ను హైదరాబాద్ కు తెచ్చిన ఘనత నాదేనన్నారు.
నేనిక్కడే ఉంటానన్నారు. హైదరాబాద్లో అభివృద్ధి జరగాలంటే బీజేపీ, టీడీపీ మిత్ర పక్షాల అభ్యర్ధులను గెలిపించాలని ఆయన కోరారు. ఏపీలో నామీద నమ్మకం ఉంచి నాకు ఓటు వేశారన్నారు. ఢిల్లీలో ఎన్టీఏతో భాగస్వామ్య పక్షంగా ఉన్నామన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో అభివృద్ధి కావాలంటే టీడీపీ-బీజీపే అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ ఏపీ గురించే కాదు తెలంగాణ గురించి కూడా మాట్లాడుతున్నానన్నారు. ఆరోజు దూరదృష్టితో ఆలోచించా కాబట్టే, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు తీసుకొచ్చానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 18 నంచి 20 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచి వచ్చేదన్నారు.
విభజన జరిగిన త్రవాత 45 నుంచి 55 శాతం హైదారాబాద్ నుంచి వస్తుందన్నారు. ఇప్పుడు అదే ఆదాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగించుకుంటుందన్నారు. హైదరాబాద్ ఏ ఒక్కరిదీ కాదని, అందరిదన్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు మీకు రక్షణ ఇచ్చే బాధ్యత నాదేనన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎంతో కీలకమన్నారు. అలాంటి ఈ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్ధులకు కమలం గుర్తుపై ఓటు వేయాలని, అదే టీడీపీ అభ్యర్ధుల కొరకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని పిలుపునిచ్చారు.