‘బాబు’ బాగా బిజీ.. ఇప్పుడిక లోకేష్ కూడా అటే.. ఎలా? టీ-టీడీపీలో అంతర్మథనం
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించడంతో టీ-టీడీపీకి దిక్కెవరన్న ప్రశ్న ఉత్పన్నమైంది.
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పూర్తిగా పాలనా వ్యవహారాలతో బిజీ అయిపోయారు. హైదరాబాద్ నుంచి తన మకాంను కూడా అమరావతికి మార్చిన ఆయన పూర్తిగా రాష్ట్రాభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించారు.
ఫలితంగా తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను పట్టించుకునేంత తీరిక ఆయనకు దొరకడం లేదు. దీంతో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొంత కాలంపాటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించారు. తరచూ కార్యక్రమాలకు హాజరవుతూ తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు భరోసా కల్పించారు.
ఇప్పుడు లోకేష్ కూడా అటే...
ఇప్పుడు లోకేశ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా చేరి పూర్తిగా అటు షిఫ్ట్ అయిపోయారు. అయితే లోకేశ్ నాయకత్వం తమకు కావాలంటూ తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలు కోరినా.. కుదరదంటూ చంద్రబాబు వారికి సున్నితంగా నచ్చచెప్పారు.
టీ-టీడీపీని కాపాడేదెవరు?
ఇప్పుడిక తెలంగాణలో పార్టీని కాపాడుకునే బాధ్యతను చంద్రబాబు పూర్తిగా తెలంగాణ నేతలపైనే పెట్టారు. ఈ పరిస్థితుల్లో హైకమాండ్ ఆదేశాల మేరకు టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి ఇతర నేతలను కలుపుకుని పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ప్రజాపోరు యాత్రల పేరుతో క్యాడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు.
సుజనా చౌదరి ఎందుకొచ్చారో...
ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అదే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి సుజనాచౌదరి ముఖ్య అతిథిగా హాజరుకావడం పార్టీలో చర్చకు దారితీసింది. దీనిపై తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఆంధ్రా పార్టీగా ముద్ర...
ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు అవకాశం దొరికనప్పుడల్లా తెలుగుదేశం పార్టీని ఆంధ్రాపార్టీ అంటూ ఎత్తి దెప్పుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీ-టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి సుజనా చౌదరి హాజరు కావడాన్ని తెలుగు తమ్ముళ్లు తప్పుబడుతున్నారు. దీనివల్ల మరింతగా తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లు అయిందని కొందరు నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు.. టీటీడీపీపై ఇంతెత్తున లేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ఇది మరో విమర్శనాస్త్రంగా మారుతుందనేది టీ-టీడీపీ నేతల వాదన.
జాతీయ పార్టీల దారిలో...
అంతేకాదు, ఇప్పుడు టీ-టీడీపీలో మరో చర్చ కూడా వేడి పుట్టిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రాలలో పార్టీ శాఖలకు ఇన్ఛార్జ్లను నియమించే సంప్రదాయం బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో ఉండేది. తెలుగుదేశంలో ఇప్పటివరకు ఈ సంప్రదాయం లేదు. పార్టీ వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడే చూసుకునే వారు.
ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ అవసరమా?
ప్రస్తుతం ఆయన ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ.. మరీ కాంగ్రెస్ అధిష్టానం మాదిరిగా ఢిల్లీ అంత దూరంలో లేరు. ఏ అవసరం ఉన్నా కొన్ని గంటల్లోనే ఏపీకి వెళ్లి అధినేతకు పరిస్థితులు నివేదించుకునే అవకాశముంది. చంద్రబాబు కుటుంబం ఇంకా హైదరాబాద్లోనే ఉంటున్నందున వారు తరచూ ఇక్కడకు వచ్చి వెళుతూనే ఉన్నారు. కనుక తెలంగాణలో పార్టీకి ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జ్ అవసరం లేదన్నది పార్టీలో ఒక వర్గం నేతల అభిప్రాయం.
అవసరమే అంటోన్న మరో వర్గం...
అయితే పార్టీలో మరో వర్గం మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. తెలంగాణలో పార్టీ వ్యవహారాల కోసం హైకమాండ్ దూతగా ఒక ఇన్ఛార్జ్ ఉండటం అవసరమే అన్నది రెండో వర్గం వాదన. పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండే చంద్రబాబును ఎప్పుడంటే అప్పుడు కలుసుకునే వీలు కుదరకపోవచ్చు. కాబట్టి పార్టీ ఇన్ఛార్జ్గా ఒక నేత ఉంటే తమ సాధకబాధకాలు ఎప్పటికప్పుడు సదరు నేతకి నివేదించుకునే అవకాశం ఉంటుందన్నది వారి అభిప్రాయం.
‘సుజనా'కు అప్పగిస్తారా?
ఈ బాధ్యతను సుజనా చౌదరి వంటి నేతలకి అప్పగిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, ఆయన కేంద్ర మంత్రి కూడా కావడం వల్ల ఢిల్లీ స్థాయిలో సమస్యలుంటే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి, సత్వరం వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంటుందని కూడా కొందరు భావిస్తున్నారు.
చంద్రబాబుదే తుది నిర్ణయం...
దీనికితోడు హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారాలున్న నాయకుడు కావడంతో ఇక్కడ పార్టీకి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా భరోసా లభిస్తుందని కూడా పలువురు నేతలు సూచిస్తున్నారు. మరి టీ-టీడీపీ నేతల ఈ అభిప్రాయాలపై పార్టీ అధినేత చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!