ఏపీపై బాబు మమకారం, టిలో టిడిపి ఔట్: ఎదురు తిరిగిన 'రేవంత్' స్ట్రాటజీ
హైదరాబాద్/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఏపీ పైనే దృష్టి సారిస్తున్నారని, తెలంగాణ వైపు చూసే పరిస్థితి కనిపించడం లేదని అందుకే తాను తెరాసలో చేరుతున్నామని తెలంగాణ టిడిపి నేతలు చెబుతున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది టిడిపి నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో గ్రేటర్ ఎన్నికల తర్వాత చేరిన ముగ్గురు ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్, వివేక్లతో కలిపి... మొత్తం 9మంది కారు ఎక్కారు. మిగిలిన ఆరుగురిలో ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో తెలియని పరిస్థితి.
తెరాసలో చేరుతున్న తెలంగాణ ఎమ్మెల్యేలు చెబుతోంది... దాదాపు ఒకటే మాట. చంద్రబాబు ఏపీ పైన దృష్టి సారించారని, తెలంగాణను చూసే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. టిడిపిని బతికించులోకే తెరాసలో చేరుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు మంచివారని, ఆయనతో తమకు ఇబ్బందులు లేవని చెప్పారు.
పార్టీ తమకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఎమ్మెల్యేలుగా గెలిచామని, అయితే ఇప్పుడు తెలంగాణలో టిడిపి కోలుకోలేని పరిస్థితుల్లో ఉందని, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాము కారు ఎక్కుతున్నట్లు చెబుతున్నారు. అయితే, సీనియర్ల చేరికకు ప్రధానంగా రేవంత్ రెడ్డి కారణంగా తెలుస్తోంది.
రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం చాలా ప్రాధాన్యత ఇస్తుండటంతో జీర్ణించుకోలేని సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారని అంటున్నారు. గ్రేటర్ ఎన్నికలు, నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలోను రేవంత్ రెడ్డి హవా కనిపించింది. నారా లోకేష్.. సీనియర్లను పక్కన పెట్టి రేవంత్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు.
ఎర్రబెల్లి దయాకర రావు వంటి సీనియర్లను పక్కన పెట్టి నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్కు పార్టీలో అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకనే ప్రధానంగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారని అంటున్నారు.
అదే సమయంలో పక్కన ఏపీలో టిడిపి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు తెలంగాణ టిడిపి నేతలను ఇరుకున పెడుతోంది. దానికి తోడు తెలంగాణలో టిడిపి కనుమరుగయ్యే స్థితిలో ఉందని తెరాసలో చేరుతున్న వారు అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సైకిల్ దగాల్సి వస్తోందంటున్నారు.
రెండు రోజుల క్రితం తెరాసలో చేరిన సమయంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ... చంద్రబాబు ఏపీకి వెళ్లిపోవడంతో తెలంగాణలో పార్టీ వీక్ అయిందని, తెలంగాణలో పార్టీ నాయకత్వం కొరవడిందని ఆయన చెప్పారు. తద్వారా రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యతను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారని అర్థమవుతోంది.
మరోవైపు, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ చేరికల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెరాస తమ ఎమ్మెల్యేలను భయపెడుతోందని, వ్యాపారాల భయంతో వారు కారు ఎక్కుతున్నారని చెబుతున్నారు. ఇది కెసిఆర్కు భవిష్యత్తులో ఎదురు తిరుగుతుందంటున్నారు.