టీఆర్ఎస్ను నమ్ముకుంటే: గౌడ్, ఢిల్లీకి బాబు ఇంటి గొడవ, సెక్షన్ 8 రగడ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని నమ్ముకుంటే పదవులు వస్తాయనేందుకు తానే నిదర్శనం అని శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం అన్నారు. సెక్షన్ 8ను రుద్దాలనుకుంటే మరో ఉద్యమం ప్రారంభమవుతుందని హెచ్చరించారు. హైదరాబాదు పైన పీటముడి వేయాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వంపైనా, హైదరాబాద్ పైనా ఏపీ సర్కారు పెత్తనం చేస్తానంటే కుదరదన్నారు. ఏదో రాజధాని లేదు కదా కట్టుకుంటామంటే ఇక్కడ పదేళ్లపాటు ఉండనీయడానికి ఒప్పుకున్నామన్నారు. ఎన్ని కుట్రలు చేసినా భరించాం, ఎన్ని చిచ్చులు పెట్టాలని చూసినా ఓర్చుకున్నామన్నారు.
ఇక్కడ చంద్రబాబుకు పాలన కోసం అవకాశం ఇచ్చామని, అంతేగానీ ఇక్కడ ఆయనకేం అధికారాలు ఉండవన్నారు. తెలంగాణ వచ్చినా కూడా చంద్రబాబు కుట్రలు మానలేదన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని పరిక్షీంచొద్దని, సెక్షన్-8 పేరుతో కేంద్రంలో కుట్రలు చేస్తే సహించమన్నారు.
ఇలాంటి వ్యవహారాలకు పాల్పడితే ఇక్కడ పుట్టగతులుండవని అన్నారు. కనీసం మంచినీళ్లు కూడా దొరకవని హెచ్చరించారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఇప్పటికైనా తప్పు ఒప్పుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. ఏమైనా అంటే చంద్రబాబు ఇపుడు తన ఇల్లు అనుమతి గురించి మాట్లాడుతన్నాడన్నారు.
సీఎంగా పని చేసిన వ్యక్తికి బిల్డింగ్ పర్మిషన్ గురించి తెలియక పోవడం దారుణమన్నారు. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఎవరు బిల్డింగ్లు కట్టినా ఒప్పుకోరన్నారు. చట్టప్రకారం పర్మిషన్ తీసుకోవచ్చన్నారు.
ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. చంద్రబాబు కొత్తగా ఇల్లు మీద లొల్లి చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎవరైనా జీహెచ్ఎంసీ నిబంధలన మేరకే ఇళ్లు కట్టుకోవాలన్నారు. వైయస్ ఇల్లు కట్టుకోవడానికి చంద్రబాబు నాడు ఐదేళ్లైనా అనుమతి ఇవ్వలేదన్నారు. చంద్రబాబు గల్లీస్థాయి నేతలా మాట్లాడుతున్నారన్నారు.
కాగా, ఇవాళ ఆయన జూబ్లీహాల్లో ఎమ్మెల్సీగా శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా బూర మాట్లాడారు. ఉద్యమానికి పెద్ద దిక్కుగా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారని, అటు జేఏసీకి ఇటు తెరాసకు మధ్య సమన్వయకర్తగా వ్యవహరించారన్నారు.
ఢిల్లీకి చంద్రబాబు ఇంటి గొడవ
హైదరాబాదులోని చంద్రబాబు ఇంటి గొడవ ఢిల్లీకి కూడా చేరుకుందని తెలుస్తోంది. ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు గురువారం కేంద్రమంత్రులతో భేటీ అయి సెక్షన్ 8 గురించి ప్రస్తావించారు. చంద్రబాబుకే ఇళ్లు నిర్మించేందుకు అనుమతులు లభించడం లేదని, ఇక సాధారాణ ఆంధ్రా ప్రజల పరిస్థితి ఏమిటని అభిప్రాయపడ్డట్లుగా తెలుస్తోంది.