ఏపీకి కేసీఆర్ అందుకే ఏమివ్వలేదు, బాబు రైట్.. తప్పుబట్టలేం, అదే కోపం, హరికృష్ణ చనిపోయినప్పుడు:కేటీఆర్
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదివారం నాడు కీలక, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పోరాడటంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. అలాగే దిగువ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీటి వాటా కోసం ఆయన పోరాడవచ్చునని చెప్పారు.
చదవండి: పవన్ కళ్యాణ్! మరిచిపోయావ్.. ఇలా చేయి, నా మద్దతు కేసీఆర్కే: నటుడు సుమన్
Recommended Video
హైదరాబాదులో సీమాంధ్రులకు తాను వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నానని, కోస్తా, సీమాంధ్రులకు నేను అండగా ఉంటానని చెప్పారు. తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబును తాము కోరామని చెప్పారు. కానీ టీడీపీ అధినేత మాత్రం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. నిజాంపేటలో నిరవ్వహించిన హమారా హైదరాబాద్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతికి రూ.100 కోట్లు ప్రకటించాలని కేసీఆర్ అనుకున్నారు
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పొత్తు మంచా, చెడా అన్నది డిసెంబర్ 11వ తేదీన తెలుస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్నదమ్ములుగా కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతోనే నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపనకు కేసీఆర్ వెళ్లారని చెప్పారు. కొత్త రాజధాని అమరావతికి రూ.100 కోట్లు ప్రకటించాలని భావించారని చెప్పారు.
మోడీ కారణంగా కేసీఆర్ ఏపీకి ఏం చేయలేకపోయారు
ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి చెంబు నీళ్లు, తట్టెడు మట్టి ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేసారు. మోడీ అలా తీసుకు రావడంతో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోలేకపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అహం దెబ్బతింటుందనే కేసీఆర్, ఏపీకి ఏ సాయం చేయలేదని, చేయలేకపోయారని చెప్పారు.
ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం
చంద్రబాబును తాము విమర్శించడానికి కొన్ని కారణాలు ఉన్నాయని కేటీఆర్ అన్నారు. చంద్రబాబు పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేశారని చెప్పారు. అది దాచినా దాగని సత్యమన్నారు. మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తే సహజంగానే మనకు కోపం వస్తుందని చెప్పారు. కోపం రాకపోతే మనం మనుషులమే కాదన్నారు.
వాస్తవానికి చంద్రబాబును తప్పుబట్టలేం
తెలంగాణలో ప్రాజెక్టులు ఆపాలని చంద్రబాబు లేఖలు రాశారని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి నేపథ్యంలో వివిధ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని చెప్పారు. వాస్తవానికి చంద్రబాబును కూడా తప్పు పట్టలేమని అన్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడాల్సిన బాధ్యత ఆయనపై ఉందని చెప్పారు. ఎగువన ఉన్న రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే ఏపీకి నీరు రాదనే ఆందోళనతో ఆయన రాసి ఉండవచ్చునని చెప్పారు.
కాంగ్రెస్కు ఆక్సిజన్, చంద్రబాబుపై అందుకే విమర్శలు
గత నాలుగున్నరేళ్లలో ప్రజలందరినీ సమానంగానే చూశామని, ఎలాంటి ప్రాంతీయ వివక్షను చూపలేదని కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో అందరూ లాభపడ్డారనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై ఉద్విగ్నతతో మాటల తూటాలు పేల్చుతున్నప్పుడు, కొందరికి బాధ కలగడం సహజమే అన్నారు. చంద్రబాబు ప్రత్యర్థి పార్టీ అధినేత కాబట్టి, కాంగ్రెస్కు ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి ఆయనపై కూడా విమర్శలు అన్నారు. కాంగ్రెస్ చచ్చిపోయిన పామని, ఇప్పుడు ఆ పార్టీ ఎగురుతోందటంటే దానికి కారణం చంద్రబాబే అన్నారు. చంద్రబాబు అండతోనే కాంగ్రెస్ నేతలు ఎగురుతున్నారన్నారు.
హైదరాబాదులోని కోస్తాంధ్ర, సీమవాసులకు కేటీఆర్ హామీ
తెలంగాణ పోరాటంలో నీటీ సమస్య ముఖ్యమైనదని కేటీఆర్ చెప్పారు. గోదావరి, కృష్ణా జలాల్లో 1200 టీఎంసీలపై తెలంగాణకు హక్కు ఉందని తెలిపారు. మన హక్కును చంద్రబాబు కాదంటే మనకు అభ్యంతరం ఉంటుందన్నారు. ఇక్కడ ఉండే రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజలకు తాను ఒకటే మాట ఇస్తున్నానని, మీలో ఒక వ్యక్తిగా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పారు. మీ మనసులో ఉన్న అనుమానాలను అన్నింటిని పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఓట్ల కోసం తప్పుడు మాటలు చెప్పే వ్యక్తిని తాను కాదన్నారు. హైదరాబాదులోని ఏపీ ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.
నారా లోకేష్ను నేను అంటాను, లోకేష్ నన్ను అంటారు
ఏపీ మంత్రి నారా లోకేష్ను ఉద్దేశించి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను హైదరాబాదులో చదువుకున్నానని, నీవు గుంటూరులో చదువుకున్నావని లోకేష్ అన్నారని, రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సాధారణమే అన్నారు. చంద్రబాబును కేసీఆర్ అంటారు, కేసీఆర్ను చంద్రబాబు అంటారని తెలిపారు. ఉత్తమ్ కుమార్ను ఇంకొకరు అంటారని, ఇంకొకరు ఆయను అంటారని, గడ్డాల గురించి మాట్లాడుకుంటామని, ఇంకో విషయం మాట్లాడుకుంటామని, ఇలా చాలా ఉంటాయని చెప్పారు.
తెలంగాణ ఏర్పడేంత వరకే గొడవ
తెలంగాణలో టీఆర్ఎస్ ఓట్ల శాతం అనూహ్యంగా పెరుగుతోందని కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడటం వల్లే తెలంగాణకు గౌరవం దక్కిందని చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు నిజమైన గౌరవం, గుర్తింపు దక్కాయని అన్నారు. తెలంగాణ ఏర్పడేంత వరకే గొడవ జరిగిందని, గత నాలుగేళ్లలో చిన్న గొడవ కూడా జరగలేదని చెప్పారు. హైదరాబాదులో 5 లక్షలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని చెప్పారు.
చంద్రబాబుకు నో చెప్పా, హరికృష్ణ చనిపోయిప్పుడు
టీఆర్ఎస్, టీడీపీలు కలిసి ఉంటే బాగుంటుందని చంద్రబాబు అన్నారని, తాను సాధ్యపడదని చెప్పానని కేటీఆర్ అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య పలు విభేదాలు వస్తాయన్నారు. హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్ఎస్ నేతలు మానవీయ కోణంలో ఎలా స్పందించారో అందరికీ తెలుసునని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి హుటాహుటినా ఆసుపత్రికి వెళ్లారని, అక్కడి నుంచి భౌతికకాయం హైదరాబాద్ వచ్చే వరకు దగ్గరే ఉన్నారని చెప్పారు. తాను, సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లి ఓదార్చామని చెప్పారు. కుటుంబం బాలో ఉన్నప్పుడు అండగా ఉండాలనే మానవీయకోణంతో ఇలా చేసామన్నారు. ఆ సందర్భంలోనే టీడీపీ, టీఆర్ఎస్ కలిసి ఉంటే బాగుంటుందని చంద్రబాబు చెప్పారని, దానికి అది సాధ్యపడకపోవచ్చు సార్ అని తాను అన్నానని కేటీఆర్ చెప్పారు. మళ్లీ మీరు తెలంగాణలో ఉండాలనుకుంటే సమస్యలు వస్తాయని చెప్పానని అన్నారు. ఈ పంచాయతీ ఎందుకు సార్ అని చెప్పానని అన్నారు. తెలంగాణలో టీడీపీకి నాయకులు ఉన్నారని చంద్రబాబు చెప్పారని, అప్పుడు తాను జీహెచ్ఎంసీ ఎన్నికలను ఉదాహరణగా చెప్పానని అన్నారు. ఏపీలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదని, తెలంగాణలో మాకు ఎలాంటి చికాకులు తేవొద్దని చెప్పానని అన్నారు.