నాకు, కేసీఆర్కు మధ్య చిచ్చుపెట్టాలని చూశారు: మోడీపై ఫైర్, పొత్తులపై తేల్చేసిన బాబు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ తెలుగు రాష్ట్రాలకు ఏమి ఇచ్చారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్న ఏ హామీ నిలబెట్టుకోలేదని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు.
హైదరాబాద్ను అభివృద్ధి చేసిన పార్టీ..
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘36 ఏళ్లుగా పార్టీని కాపాడుతున్న కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా. తెలంగాణలో కార్యకర్తలకు ఎంతో పట్టుదలగా ఉన్నారనిపిస్తోంది. మళ్లీ తెలుగుదేశం పార్టీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలకు అభినందనలు. తెలంగాణ అభివృద్ధికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం. హైదరాబాద్లో చాలా ప్రాజెక్టులు నేను ప్రారంభించినవే. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రపంచం మొత్తం తిరిగాను. విభజన తర్వాత నాపై గురుతర బాధ్యత ఉంది. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన తరహాలోనే అమరావతిని అభివృద్ధి చేయాల్సి ఉంది. భారత్లో తొలి రెండుస్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు ఉండాలి' అని చంద్రబాబు ఆకాంక్షించారు.
నాకు, కేసీఆర్కు మధ్య చిచ్చుపెట్టాలని చూశారు..
తనకు, కేసీఆర్కు మధ్య విభేదాలు సృష్టించేందుకు మోడీ ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీని అడ్డుపెట్టుకుని రాష్ట్రాలను బెదిరిస్తోందన్నారు. కేంద్ర సంస్థలను ఉసిగొల్పే సంప్రదాయం మంచిది కాదని ఎన్డీఏను హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను త్వరలోనే వంద రూపాయలు చేసేలా ఉందని ఎద్దేవా చేశారు. స్విస్ బ్యాంకుల్లోని డబ్బు తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామన్నారు.. ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు.
టీడీపీ తెలంగాణలో చారిత్రక అవసరం.. కేంద్రం నోటీసులట
నటుడు శివాజీ.. ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం కొత్త ఆపరేషన్ గరుడ అమల్లోకి తెచ్చిందని, త్వరలో నోటీసులకు కూడా ఇస్తుందని అంటున్నారని ఈ సందర్భంగా బాబు వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘అధికారం కోసం కాకుండా సిద్ధాంతం కోసం పోరాడే పార్టీ టీడీపీ.. తెలుగుదేశం అమలు చేసిన సంస్కరణ వల్లే హైదరాబాద్కు ప్రపంచ గుర్తింపు వచ్చింది. మోడీ హైదరాబాద్ వచ్చి అడిగితే ఎన్డీయేతో కలిశాం. నా జీవితంలో ఎవరికీ భయపడలేదు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. తెలంగాణ గడ్డ మీద టీడీపీ ఉండటం చారిత్రక అవసరం' అని చంద్రబాబు అన్నారు.
పొత్తులపై తేల్చేసిన చంద్రబాబు
‘ప్రజల అభిప్రాయం మేరకు పార్టీ ముందుకెళ్లాలి. రాబోయే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి' అని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడి పొత్తులపై నిర్ణయం తీసుకుంటారని చంద్రబాబు చెప్పారు. వారు తీసుకున్న నిర్ణయానికి తన మద్దతు, సహకారం ఉంటుందని తెలిపారు. తాజా నిర్ణయాల కారణంగా కొందరికి సీట్లు రాకున్నా కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కార్యకర్తలు, నేతలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై స్పష్టత ఇచ్చినట్లేనని అర్థం చేసుకోవచ్చు. కాగా, జై తెలంగాణ అంటూ చంద్రబాబు తన ప్రసంగాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేతలు దేవేందర్గౌడ్, పెద్దిరెడ్డి, గరికపాటి మోహనరావు, రావుల చంద్రశేఖర్రెడ్డి, నామా నాగేశ్వరరావుతో పాటు పలు జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చారు.