హరికృష్ణ మొహమాటం లేకుండా మాట్లాడేవారు: బాబు, పక్కనే దిగాలుగా జూ.ఎన్టీఆర్
Recommended Video
హైదరాబాద్: హరికృష్ణ ఏ పదవిలో ఉన్నా నీతి, నిజాయితీతో పని చేసేవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. మొహమాటం లేకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఆయనది అన్నారు. ఎన్టీఆర్కు రథసారథిగా హరికృష్ణ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. కుటుంబ సభ్యుడిని, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతను తాము కోల్పోయామన్నారు.
టీడీపీ నేత, నటుడు నందమూరి హరికృష్ణ నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
బోరున విలపించిన జూనియర్, కళ్యాణ్ రామ్
కన్నతండ్రిని కోల్పోయిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్లు కన్నీరుమున్నీరు అయ్యారు. కామినేని ఆసుపత్రిలో తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి భోరున విలపించారు. వారు వెళ్లిన కాసేపటికి బాలకృష్ణ, ఆ తర్వాత చంద్రబాబు, నారా లోకేష్లు వచ్చారు. అనంతరం అందరూ ఆసుపత్రిలోని ఓ గదిలో వారు కూర్చున్నారు.
చంద్రబాబు పక్కన బాధలో జూ.ఎన్టీఆర్
ఈ సమయంలో చంద్రబాబుకు ఓ వైపు జూనియర ఎన్టీఆర్, మరోవైపు కళ్యాణ్ రామ్లు కూర్చున్నారు. ఎదురుగా బాలకృష్ణ, మరో సీటులో నారా లోకేష్, ఇంకో సీట్లో తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూర్చున్నారు. గదిలోని వారంతా ఎంతో ఎంతో బాధలో కూర్చున్నారు. ఆ గదిలో చంద్రబాబు, జూనియర్ పక్కపక్కన కూర్చోగా, ఆ తర్వాత బాలకృష్ణ లోపలకు వచ్చారు. అనంతరం కళ్యాణ్ రామ్ వచ్చి చంద్రబాబు పక్కన కూర్చుంటారు. ఆ సమయంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లో ఎంతో ఆవేదనగా ఉన్నారు.
తీరని కళ్యాణ్ రామ్ కోరిక
సొంత బ్యానర్లో తండ్రితో కలిసి తాను, జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలని కళ్యాణ్ రామ్ భావించారు. తమ ముగ్గురి పాత్రలను ప్రధానంగా చేసుకుని ఒక కథను సిద్ధం చేయమని కూడా ఆయన కొంతమంది రచయితలకు చెప్పాడని అంటున్నారు. కథ కుదిరితే తండ్రితో కలిసి నటించాలనే ఆసక్తిని ఎన్టీఆర్ కూడా కనబర్చాడు. కానీ ఈలోగానే ఘోరం జరిగింది.
అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు
గురువారం జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి. హరికృష్ణను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు తరలి వస్తున్నారు. దీంతో మాసాబ్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాసాబ్ ట్యాంక్ నుంచి సరోజిని ఆసుపత్రి మార్గంలో ఎవరూ రావొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. బజర్ఘాట్, ఆసిఫ్నగర్ మీదుగా వెళ్లాలని సూచించారు. గచ్చిబౌలి నుంచి వచ్చేవారు ఫిలిం నగర్ మీదుగా వెళ్లాలని చెప్పారు.