ఇక సుహాసిని అంతేనా, ఓటుకు నోటు తిరగదోడి ఏం చేస్తారు: కేసీఆర్ ఝలక్-బాబు దిమ్మతిరిగే షాక్
Recommended Video
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. శనివారం టీడీపీ అధినేతపై కేసీఆర్ నిప్పులు చెరగగా, ఆదివారం చంద్రబాబు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. రెండు దశాబ్దాల క్రితం నాటి వైస్రాయ్ ఇష్యూ నుంచి ఓటుకు నోటు, ఏపీలో కేసీఆర్ ప్రచారం వరకు.. దాదాపు అన్ని అంశాలపై విమర్శలు చేసుకున్నారు.
కేసీఆర్కు షాకింగ్: 'సంక్రాంతి తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుంది!'
చంద్రబాబు అవకాశవాది అని, వాడుకొని వదిలేయడంలో ఆయన నెంబర్ వన్ అని కేసీఆర్ విమర్శలు చేయగా, చంద్రబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. అసలు కేసీఆర్ టీడీపీ ద్వారానే ఎదిగాడని విమర్శించారు. నరేంద్ర మోడీనే తనను ఏం చేయలేకపోయారని, ఇక కేసీఆర్ ఏం చేస్తారని మండిపడ్డారు.
ఏపీకి రావాలనుకుంటే రా, నేరుగా పొత్తు పెట్టుకోవాలని సూచన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పారని, ఏపీ ఎన్నికల్లోను అదే జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ శనివారం చెప్పారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటానని కూడా చెప్పారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ... కేసీఆర్ ఏపీకి వచ్చి ప్రచారం చేసుకోవచ్చునని, అవసరమైతే జగన్, మోడీ, కేసీఆర్లు కలిసి పోటీ చేయవచ్చునన్నారు. చల్లకొచ్చి ముంత దాచినట్లుగా చేయవద్దని, అందరు కలిసి పోటీ చేయవచ్చునని చెప్పారు. తాము ఏపీలో ఎంతో అభివృద్ధి చేశామని, తనను నమ్మి రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాలు ఇచ్చారని, కానీ కేసీఆర్ తన సొంత నియోజకవర్గంలోనే ఓ ప్రాజెక్టుకు భూమిని తీసుకోలేకపోయారన్నారు.
ఓటుకు నోటు కేసును తిరగదోడి ఏం చేస్తారు?
ఓటుకు నోటు కేసును తిరగదోడి ఏం చేస్తారని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీయే తనను ఏం చేయలేకపోయారని, ఇక కేసీఆర్ ఏం చేస్తారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు మాట్లాడాలంటే చాలా ఉంటాయని చెప్పారు.
కాంగ్రెస్తో పొత్తుపై కౌంటర్
కాంగ్రెస్ పార్టీతో పొత్తును కేసీఆర్ తప్పుబట్టారు. చంద్రబాబు నాలుగేళ్లు మోడీ పంచన ఉన్నారని, ఇప్పుడు రాహుల్ గాంధీ పంచన చేరారని, రాహుల్ వస్తామని అన్నప్పుడు ఎందుకు బతికున్నామో చూడటానికా వచ్చారా అని అన్నారని, ఇప్పుడు మోడీ వస్తానంటే ఏ ముఖం పెట్టుకుని అంటూ వ్యతిరేకిస్తున్నారని, వారికి (చంద్రబాబు) ఒక విధానం, మాటమీద నిలబడే తత్వం లేదని, చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై చంద్రబాబు కూడా ధీటుగా స్పందించారు. గతంలో కేసీఆర్ కూడా తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీతో జతకట్టారని, ఇప్పుడు తాము హోదా కోసం కాంగ్రెస్తో జతకట్టామని అభిప్రాయపడ్డారు. అలాగే 2009లో తన పార్టీని వైయస్ సర్వనాశనం చేస్తుంటే పొత్తు కోసం కేసీఆర్ తన వద్దకు పరుగెత్తుకొచ్చారన్నారు.
మాటకు మాట
1996లో కేంద్రంలో తాను చక్రం తిప్పానన్న చంద్రబాబు వ్యాఖ్యలపై నిన్న కేసీఆర్ దుమ్మెత్తి పోశారు. గతంలో చంద్రబాబు చక్రం తిప్పానని చెప్పారని, ఆయన చక్రం తిప్పలేదు, మన్నూ లేదని, అప్పుడూ ఏమీ చేయలేదని, అదో మోసమని, చంద్రబాబు చెప్పేదాన్ని ఒకటి, రెండు పత్రికలు ఈస్ట్మన్ కలర్లో చూపిస్తాయని, చంద్రబాబుకు నాలుగు ముక్కలు ఇంగ్లీష్ రాదని, రెండు ముక్కలు హిందీ రాదని, జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తారా అన్నారు. దీనిపై ఈ రోజు చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు ఇంగ్లీష్ రాదని కేసీఆర్ చెబుతున్నారని, ఆయన ఏమైనా ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారా అని ప్రశ్నించారు.
సుహాసినిని పట్టించుకుంటారా?
హరికృష్ణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని కూకట్పల్లిలో గెలుద్దామని చంద్రబాబు అనుకున్నారని కేసీఆర్ చెప్పారు. ఆయన బిడ్డ సుహాసినిని తీసుకువచ్చి కూకట్పల్లి నుంచి నిలబెట్టారని, చంద్రబాబు ఇప్పుడు ఆమెను పట్టించుకుంటారా అని ప్రశ్నించారు. ఆయన పచ్చి అవకాశవాది అని, వాడుకొని వదిలేయడంలో నెంబర్ వన్ అన్నారు. రాజకీయాల కోసం ఎవరినైనా బలి చేస్తారన్నారు. తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు కూడా ఆదివారం తీవ్రంగానే స్పందించారు.
దిమ్మతిరిగే షాక్
హరికృష్ణ మృతి సమయంలో రాజకీయం చేశారని తెరాస నేతలు చెప్పగా, ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల కోసం ఇద్దరు కలిసి పని చేద్దామని చెప్పానని చంద్రబాబు ఆదివారం నాడు అంగీకరించారు. కానీ తాను రాజకీయం చేయలేదని, తెలుగు రాష్ట్రాల కోసం మాట్లాడానని చెప్పారు. అలాగే, తెరాస నేతలు పదేపదే వైస్రాయ్ హోటల్ అంశాన్ని తీసుకురాగా చంద్రబాబు దీనిపై ధీటుగా స్పందించారు. ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని తీసుకున్నారని చెబుతున్నారని, కానీ అప్పుడు కేసీఆర్ తన వెంటే ఉన్నారని, అసలు సిద్ధాంతకర్తే ఆయన అని దిమ్మతిరిగే షాకిచ్చారు.