చంద్రబాబుకు నోటీసుల పర్వం..! తెలంగాణలో టీడిపికి అనుకూలం..!
Recommended Video
హైదరాబాద్ : సంచలనం స్రుష్టించిన చంద్రబాబు నోటీసుల కేసు న్యాయపరంగా ఏ మలుపు తీసుకుంటుందొ గాని., రాజకీయపరంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మాత్రం కలిసొచ్చే అంశంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకోసం కట్టుబడి, తెలంగాణకు న్యాయం చేసేందుకు ఆనాడు బాబ్లీ కి అడ్డుపడ్డామని తెలుగుతమ్ముళ్లు గొంతెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గళం తెలంగాణలో వినిపించకూడదు అనుకున్నప్పటికి, నోటీసుల పరంపరతో మరోసారి టీడిపి తెలంగాణ ప్రజలమద్యకు వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇదే అంశం తెలుగు దేశానికి మంచి సానుభూతి తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది.
అందరి ద్రుష్టి 9/21 పైనే..! చంద్రబాబు నోటీసుల పర్వం ఏ మలుపు తిరగనుంది..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇరు రాష్ట్రాల్లో వేరు వేరు షెడ్యూల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నా, రాజకీయ పార్టీలు మాత్రం అందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు, ఆయనతో పాటు మరో 14 మందిని ఈ నెల 21న విచారణకు హాజరు పరచాలని ఆదేశించింది. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఎప్పుడో 2010లో జరిగిన ఘటనకు ఇప్పుడు నోటీసులు జారీ చేయడం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
నోటీసుల ఇష్యూ తెలంగాణలో టీడిపి ప్లస్ అయ్యే అవకాశం..!
ఇదిలా ఉండగా చంద్రబాబు నోటీసులను వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు తెలుగుతమ్ముళ్లు. చంద్రబాబుకు నోటీసులు రావడం తెలుగుదేశం పార్టీకే అనుకూలమనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నందున ఈ వ్యవహారంలో టీడీపీని హీరోగా చూపించుకునే అవకాశం ఆ పార్టీ నేతలకు ఉంది. తెలంగాణ ప్రయోజనాల కోసం టీడీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉందని, బాబ్లీ పోరాటాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేసి, సానుకూల భావనను కలిగించేందుకు ఈ అంశం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదనే చర్చ కూడా జరుగుతోంది. దీనిని ఆ పార్టీ క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్తే ఎన్నికల్లో టీడీపీకి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది.
అసలేం జరిగింది..? నోటీసులెందుకు జారీ అయ్యాయి..?
మహారాష్ట్రలో గోదావరి పై నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010సంవత్సరంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు బాబ్లీ సందర్శనకు బయలుదేరారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం, దానికి అనుబంధంగా అనేక ఎత్తిపోతల పధకాల నిర్మాణాలు చేపట్టడం వల్ల గోదావరిలో నీటి ప్రవాహం తగ్గి, ఉత్తర తెలంగాణా ఎడారిగా మారుతుందని తెలుగుదేశం ఆందోళన చేపట్టింది. తెలంగాణా సరిహద్దులు దాటి ఈ బృందం మహారాష్ట్రంలోని ధర్మాబాద్కు చేరుకున్న వెంటనే అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ తాము బాబ్లీ ప్రాజెక్టును సందర్శించాల్సిందేనని చంద్రబాబు పట్టుబట్టడం, ముందుకు చొచ్చుకు వెళ్లడంతో మహారాష్ట్ర పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. చంద్రబాబు మినహా మిగతా ఎమ్మెల్యేలపై జరిగిన లాఠీ ఛార్జిలో అనేక మంది గాయపడ్డారు. అనంతరం చంద్రబాబుతో సహా అందర్నీ అదుపులోకి తీసుకుని ఓ ప్రభుత్వ కాలేజీలో నిర్భందించారు.
బాబు కోర్టుకు హాజరౌతారా..? లేదా..? అంతా ఉత్కంఠ..!
ఈ సంఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. చంద్రబాబు పై కేసులు నమోదు చేయడంతో బెయిల్ తీసుకోవాలని అక్కడి పోలీసులు కోరగా, బెయిల్ తీసుకునేందుకు నిరాకరించారు.తర్వాత చంద్రబాబును విమానం ఎక్కించి బలవంతంగా హైదరాబాద్కు పంపారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ అమలులో ఉన్నా పట్టించుకోకపోవడం, వంటి వివిధ కారణలతో చంద్రబాబుపై కేసు నమోదయ్యాయి. ఎనిమిది నెలల క్రితం చంద్రబాబుకు మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం కోర్టుకు హాజరుకాకపోవడంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచీ ఈ వారెంట్ పెండింగ్లో ఉంది. ఇటీవల మహారాష్ట్ర వాసి ఒకరు ఈ నాన్ బెయిల్బుల్ వారెంట్ను ఎందుకు అమలు చేయడంలేదంటూ పిటీషన్ వేయడంతో కోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది. దీంతో తాజాగా చంద్రబాబు నాయుడుతో పాటు 14మందికి ధర్మాబాద్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది.