చంద్రబాబును కలిసిన డీఎస్-ఉత్తమ్, కుదిరిన పొత్తు: ఆ సీట్లపైనే టీడీపీ-కాంగ్రెస్ పట్టు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడిన మహా కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు ఖరారైందని తెలుస్తోంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లో తేలినప్పటికీ, ఏయే స్థానాలు ఎవరికి ఇవ్వవలసి ఉందో తేలాల్సి ఉందని సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణలు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై టీడీపీ అధినేత రంగంలోకి దిగారు.
Recommended Video
పొత్తుపై కాంగ్రెస్లో రుసరుస: రంగంలోకి తెలుగుదేశం, కూటమిలో కుదిరిన సీట్ల లెక్క
గెలుపే ముఖ్యం, పంతం వద్దు
ఈ సందర్భంగా చంద్రబాబు వారితో మాట్లాడుతూ.. మహాకూటమి గెలుపు ముఖ్యమని, ఎవరికి ఎన్ని సీట్లు, ఏయే స్థానాలు అనేది ముఖ్యం కాదని, గెలవని సీట్ల కోసం పంతాలకు పోయి అవకాశం వదులుకోవద్దని, సర్దుబాటు చేసుకోవాలని, ఏ పార్టీ ఎక్కడ, ఏ అభ్యర్థి ఎక్కడ గెలుస్తాడనుకుంటే వారికే ఇవ్వాలని చంద్రబాబు హితబోధ చేశారు.
చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ
మహాకూటమి సీట్ల సర్దుబాటు అంశంపై ఢిల్లీలో చంద్రబాబు, ఉత్తమ్, ఎల్ రమణలు శనివారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి పది గంటలు దాటిన తర్వాత దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. నామినేషన్లకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్ల పంపకాలను త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ 91, తెలంగాణ జన సమితి 8, టీడీపీ 15, సీపీఐ అయిదు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఎవరు ఏయే సీట్లలో పోటీ చేయాలో తేలాల్సి ఉంది. మహాకూటమిలో ఆర్ఎల్డీ కూడా చేరే అవకాశాలున్నాయి. వారు రెండు స్థానాలు అడుగుతున్నారని తెలుస్తోంది.
ఆ సీట్ల పైనే ప్రతిష్టంభన
శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్లో ఉత్తమ్, కోదండరాం, రమణల మధ్య జరిగిన చర్చల కొనసాగింపుగా శనివారం ఢిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారని సమాచారం. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఎల్బీ నగర్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్ వంటి సీట్లే ప్రధాన సమస్యగా మారాయని సమాచారం. తెలంగాణ జన సమితి, సీపీఐ సైతం కాంగ్రెస్, టీడీపీలు బలంగా కోరుతున్న కొన్ని సీట్లపై పట్టుపడుతున్నాయి. ఇది ప్రతిష్టంభనకు కారణమైంది. పార్టీ బలం, అక్కడ ఆ పార్టీకి ఉన్న అభ్యర్థి విజయావకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించారని తెలుస్తోంది. అవసరమైతే త్యాగాలు చేయకతప్పదన్నారు.
చంద్రబాబుతో డీఎస్ భేటీ
చంద్రబాబుతో అంతకుముందు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, డి రాజా, నారాయణలు కలిశారు. వారితో కలిసి చంద్రబాబు రాత్రి భోజనం చేశారు. దేశ రాజకీయాలు, ఏపీలో పరిస్థితులే ఎక్కువగా వారి మధ్య చర్చకు వచ్చాయి. తెలంగాణలో సీట్ల సర్దుబాటు అంశంపై కూడా వారు చర్చించారు. మరోవైపు, చంద్రబాబును డీ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసారు.