తెలంగాణ టీడిపి నేతలతో టెలీకాన్ఫరెన్స్.. ఘాటుగా హెచ్చరించిన చంద్రబాబు..
టిటిడిపి నేతల పై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారా...? ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతుంటే టిటిడిపి మాత్రం పొత్తుల పై ద్రుష్టి సారిచిందని మండిపడుతున్నారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు తెలంగాణ టిడిపిలో ఏం జరుగుతోంది...? చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో ఎందుకు సీరియస్ అయ్యారు..? ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న నేతలు బాబు వార్నింగ్ తో ఎందుకు అలర్ట్ అయ్యారు ? ఇంతకి బాబు ఆదేశాలతో తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఎలాంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయబోతోంది ? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
తెలంగాణ నేతలపై బాబు సీరియస్.. ప్రజాక్షత్రంలోకి వెళ్లాలని ఆదేశాలు..
ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం తారా స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ లోని అన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. వినూత్న కార్యక్రమాలు రూపొందించుకుంటూ ప్రజక్షేత్రంలోకి వెళ్తున్నాయి. తెలుగు దేశం పార్టీ మాత్రం ఎలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా స్తబ్దుగా ఉండడాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు జీర్నించుకోలేకపోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరించారని గుర్తుచేస్తున్నారు. 2014లో ఏపీ సీఎంగా చంద్రబాబు భాద్యతలు తీసుకున్న తరువాత తెలంగాణ తెలుగుదేశం పార్టీ పైన అంత శ్రద్ద చూపడం తగ్గించారు. ఇదే సమయంగా భావించిన కొంతమంది ముఖ్యనేతలు అదికార గులాబీ పార్టీలోకి వెళ్లి పోయారు. దీంతో రాష్ట్రంలో పసుపుజెండా కదలికలు సన్నగిల్లాయి.
అలర్ట్ గా ఉండాలని తెలంగాణ నేతలకు బాబు క్లాస్..
విషయం తెలుసుకున్న చంద్రబాబు తరచుగా ఎన్టీఆర్ భవన్ లో సర్వసభ్య సమేవేశాలు నిర్వహించారు. నేతలకు అండగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కానీ బాబు సూచనల మేరకు నాయకులు పని చేయకపోడంతో పార్టీ డీలా పడిపోయింది. కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర, బీజేపీ జన చైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తుంటే టీడీపీ మాత్రం ఎన్టీఆర్ భవన్ దిగి బయటకు రాక పోవడం విశేషం. కనీసం వారానికి ఒక మీటింగ్ సైతం ఏర్పాటు చేసుకోవడంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలం చెందింది. దీంతో విసుగుచెందిన పార్టీ శ్రేణులు బాబుకు ప్రత్యక్షంగా ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. అందుకు ఘాటుగా స్పందించిన చంద్రబాబు గతవారం రోజుల్లో మూడు సార్లు టిటిడిపి ముఖ్యనేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు రూపొందించుకోవాలని గట్టిగా హెచ్చరికలు జారీ చేసారు.
పొత్తులపై చర్చ అప్రస్తుతం.. సమయం వచ్చినప్పుడు స్పష్టత ఇస్తానన్న చంద్రబాబు..
ఎన్నికలను సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్తే క్యాడర్ లో భరోసా ఉంటుందని, లేదంటే వచ్చే ఎన్నికల్లో నెట్టుకు రావడం కష్టంతో కూడుకుంటుదని చంద్రబాబు ముఖ్య నేతలకు తేల్చి చెప్పినట్టు సమాచారం. పార్టీ పటిష్ఠంగా ఉంటే పొత్తుకోసం ఇతర పార్టీలు సంప్రదిస్తాయని., అలా కాకుండా పొత్తుకోసం టీడిపి ఎదురుచూడటం సమంజసంగా ఉండదని బాబు సీరియస్ అయ్యారని తెలుస్తోంది. . చంద్రబాబు వార్నింగ్ తో మేల్కొన్న టిటిడిపి నేతలు అకస్మాత్తుగా ఎన్టీఆర్ భవన్ లో రెండు సార్లు ముఖ్యనేతల అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భవిశ్యత్ కార్యక్రమాల గురించి ప్రణాళికలు రూపొందించారు. అందులో భాగంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభలతో పాటు, కాళేశ్వరం, నల్గొండ జిల్లాలలో మొత్తం 80 చోట్ల సభలు నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు టిటిడిపి రాష్ట్ర నాయకులు.
మేల్కొన్న టీటీడిపి.. ప్రజా సమస్యలపై కార్యాచరణ..
కాగా చంద్రబాబుకు మాత్రం పార్టీ క్యాడర్ గురించి రాష్ట్ర నాయకత్వం తప్పుడు సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని బాబు ముఖ్య నేదలతో చర్చించినట్టు తెలుస్తోంది. క్యాడర్ పార్టీతో ఉండాలంటే అదికార పార్టీ విధానాలపైన పోరాటం చేసే కార్యక్రమాలు రూపొందించుకుని ప్రజల మద్యన పార్టీని నిలబెట్టాలని సూచించారు. పొత్తుల పై ఏ పార్టీతో వెళ్లాలనేది ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటానని బాబు తెలియజేసినట్టు సమాచారం. ముందుగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విభజన హామీల అమలే లక్ష్యంగా ఈ నెల 27న ములుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు టీడిపి నేతలు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై ఒత్తిడి తీసుకు రావాలన్నది టీటిడిపి ప్లాన్ గా తెలుస్తోంది. ములుగు బహిరంగ సభ ద్వారా ప్రజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని టీటీడిపి భావిస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో టీటీడిపి ప్రజాకార్యక్రమాలను ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారో చూడాలి.