ఓటుకు నోటుపై కేసీఆర్ ఎత్తు, ఫోన్ ట్యాపింగ్పై బాబు పైఎత్తు?
హైదరాబాద్: ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావులు ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓటుకు నోటు వ్యవహారం చంద్రబాబును, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కేసీఆర్ను చిక్కుల్లోకి నెట్టేలా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యాధారాలైన ఆడియో, వీడియో టేపుల పరిశీలనపై ఏసీబీ కేవలం రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్లోనే కాకుండా మరింత పక్కాగా తేల్చేందుకు ఇతర రాష్ట్రాల్లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లకు పంపించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్తో పాటు చండీగఢ్, పుణే, సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్లకు సైతం రేవంత్, స్టీఫెన్ వీడియో సంభాషణలు, చంద్రబాబు ఆడియోగా భావిస్తున్న టేపులను పంపించాలని నిర్ణయించింది. హైదరాబాదుతో పాటు పుణే, చండీగఢ్, సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్లో నిర్వహించనున్నారు.
గతంలో ఎఫ్ఎస్ఎల్లో పని చేసిన కీలక అధికారి గాంధీని ఏపీ ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది. ఈయన లాబీయింగుతో కేసులో నివేదికలు మారే అవకాశముందని గ్రహించిన ఏసీబీ వర్గాలు ఇతర రాష్ట్రాల ఎస్ఎఫ్ఎల్లకు ఆడియో, వీడియో టేపులను పంపించాలని నిర్ణయించింది.
మరోవైపు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు.. కేసీఆర్ అడుగులను బట్టి ముందుకు వెళ్తున్నారని తెలుస్తోంది. ట్యాపింగ్ పెద్ద నేరంగా చెబుతున్నారు. 120 మందికి పైగా ఏపీ ముఖ్యుల పోన్లు ట్యాపింగ్ చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి వివరాలు వెల్లడించవద్దని టీఆర్ఎస్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాసినట్లుగా తెలుస్తోందని వార్తలు వచ్చాయి. ఏపీ పోలీసులు 12 సర్వీస్ ప్రొవైడ్లకు పూర్తి వివరాలు కావాలని తాజాగా లేఖ రాశారు. కేసీఆర్ దూకుడుగా వెళ్తే, వాటి ఆధారంగా ముందుకెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.