లాలూ ప్రసాద్లా, 90 శాతం ఖాళీ: బాబుపై దుమ్మెత్తిపోసిన హరీష్, వారిని కలిపిన కేటీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై హరీష్ రావు శనివారం తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. కృష్ణా జలాలను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏమిటని, ఉనికి కోసమే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో కలిసిందని ఆరోపించారు. ఆయన సిద్దిపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సిద్దిపేట, చిన్నకోడురు, నంగనూరు మండలాలకు చెందిన పలువురు టీడీపీ నేతలు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
భార్య తీరుతో దామోదర మనస్తాపం, ప్రచారం నిలిపేసి..: పద్మిని అందుకే తిరిగి వచ్చారా?
తాను తెలంగాణకు నీళ్లు అడ్డుకోవడం లేదని చంద్రబాబు వెల్లడించారని, కానీ ఆయన పరిస్థితి నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు ఉందని మండిపడ్డారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణా నదీజలాల్లో నాగార్జున సాగర్ జలాశయంపై తెలంగాణకు 45 టీఎంసీల నీరు న్యాయంగా రావాల్సి ఉందన్నారు. ఇది రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు.
లాలూ ప్రసాద్లా చంద్రబాబు ప్రయత్నాలు
బీహార్ నుంచి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ఆర్జేడీ అధ్యక్షులు లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రాష్ట్రంలోనూ రాజకీయంగా ఉనికి చాటుకుందామని ప్రయత్నాలు చేశారని, కానీ అక్కడి ప్రజలు దానిని బీహార్ పార్టీగా పరిగణించి, ఆర్జేడీకి స్థానం లేకుండా చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. తెలంగాణలోనూ ఆంధ్రా టీడీపీకి స్థానం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ చిరునామా గల్లంతయిందన్నారు.
చంద్రబాబును తిట్టి, ఇప్పుడు పొత్తు పెట్టుకుంటారా?
కాంగ్రెస్ ముసుగులో టీడీపీ తెలంగాణలోకి వచ్చేందుకు తనవంతుగా ప్రయత్నాలు చేస్తోందని హరీష్ రావు విమర్శించారు. కనీసం నాలుగు సీట్లలో అయినా గెలిచి తెలంగాణలో ఉనికి చాటాలని టీడీపీ కుయుక్తులు పన్నుతోందని విమర్శించారు. భద్రాచలం, రామాలయాన్ని ముంచి పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి దాని డిజైన్ మార్చాలని సుప్రీం కోర్టులో కేసు వేశారని హరీష్ రావు గుర్తు చేశారు. అసెంబ్లీలో శాసన మండలి సాక్షిగా చంద్రబాబు తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని గుర్తు చేశారు. భద్రాచలం, రామాలయం మునిగినా సరే నాలుగు సీట్లు కావాలని రెండు పార్టీలు జత కడుతున్నాయా అని ధ్వజమెత్తారు.
90 శాతం టీడీపీ ఖాళీ
తన సిద్దిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 90 శాతం ఖాళీ అయిందని హరీష్ రావు చెప్పారు. మిగిలిన 10 శాతం మంది కూడా మరికొద్దిరోజుల్లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతారని చెప్పారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి చోటు లేదని చెప్పారు.
వారిని బయట చూడలేదు, ఇప్పుడు సంతోషం
రాజస్థాన్ మార్వాడీ సమాజ్ ఆశీర్వాద సభలోను హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేట అభివృద్ధిలో రాజస్థాన్వాసుల సహకారం, ఎన్నికల్లో వారి అభిమానం మరువలేనిదని చెప్పారు. రాజస్థాన్ అక్కాచెల్లెళ్లను తాను ఎప్పుడూ సిద్దిపేటలో బయట చూడలేదని, కానీ తనను ఆశీర్వదించడానికి అందరూ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ దయవల్ల పరిశ్రమలు ఏర్పడటానికి అవసరమైన రైలు, నీళ్లు, కరెంట్, జాతీయ రహదారులు అన్నీ సమకూరుస్తున్నామని హరీష్ రావు చెప్పారు. అన్ని సదుపాయాలు ఉంటే ఇండస్ట్రీలు వాటంతట అవే వస్తాయన్నారు. వచ్చే అయిదేళ్లలో వీలైనన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి, అందులో ఎక్కువ ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని చెప్పారు.
మంథనిలో సయోధ్య కుదిర్చిన కేటీఆర్
టీఆర్ఎస్ తమ పాలనలో జరిగిన అభివృద్ధే అజెండాగా ఎన్నికలకు సన్నద్ధమయిందని, విపక్షాలు భయపడి వెనుకడుగు వేస్తున్నాయని కేటీఆర్ వేరుగా అన్నారు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శ్రీనివాస రావు, కాంగ్రెస్ సీనియర్ నేత రాజన్న, సిరిసిల్ల జిల్లా బీజేవైఎం నేత శశాంక్ తదితరులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. వంద స్థానాల్లో తెరాస గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని, ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు కూడా గల్లంతవుతాయన్నారు. చంద్రబాబు ఓటుకు నోటు కుట్రలు మళ్లీ ప్రారంభించారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలు అని మండిపడ్డారు. ఐటీ దాడులు చేస్తే తాము రాజకీయం చేయలేదని, చంద్రబాబు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కాగా, మంథని నియోజకవర్గ పార్టీ అభ్యర్థి పుట్టా మధు, స్థానిక నేత సునీల్ రెడ్డిల మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. తన నివాసంలో మధు, సునీల్ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఎన్నికల తర్వాత మంచి అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడంతో సునీల్ మధుకు సహకరిస్తానని చెప్పారు.