చంద్రబాబు రెండురోజుల తెలంగాణ పర్యటన..! తెలంగాణ సమాజం స్వాగతించిందా..?
హైదరాబాద్ :చంద్రబాబు రెండు రోజు తలెంగాణ పర్యటన మహాకూటమికి ఎంతవరకు కలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మళ్లీ తెలంగాణ ఎన్నికల సందర్బంగా ఈ రాష్ట్రంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఐతే సుధీర్గ కాలం తర్వాత చంద్రబాబు పర్యటనను తెలంగాణ సమాజం స్వాగతించిందా..? అసలు బాబు పర్యటన మహాకూటమికి కలిసొచ్చిందా.. వికటించిందా.. చంద్ర బాబు వల్ల తెలంగాణ కు నష్టం జరిగిందని గులాబీ నేతలు ఘాటుగా ఆరోపిస్తున్న తరుణంలో చంద్రబాబు రెండురోజుల పర్యటనలో తెలంగాణ ప్రజానికాన్ని ఒప్పించగలిగారా తెలుకునే ప్రయత్నం చేద్దాం..!
రెండురోజుల బాబు తెలంగాణ పర్యటన..! ఉత్సాహంలో పార్టీ శ్రేణులు..!!
తెలంగాణ జరుగుతున్న ముందస్తు ఎన్నికలు రోజు రోజుకూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. దీంతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలోని పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ముందుంది. ఆ పార్టీ అధినేత అసెంబ్లీని రద్దు చేసిన రోజే 105 అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్ఎస్ అభ్యర్థులంతా ప్రచారం ప్రారంభించేశారు. అప్పటి నుంచే అడపాదడపా మాట్లాడుతున్న చంద్రశేఖర్ రావు ఆశీర్వాద సభల్లో మాత్రం వేగం పెంచేశారు.
కేసీఆర్ విమర్శలకు ప్రతివిమర్శలు చేయని బాబు..! సంయమనంగా ప్రసంగాలు..!!
చంద్రబాబుపై విమర్శలు చేయకుండా కేసీఆర్ సభను ముగించడంలేదంటే ఆయన్ను ఎంతలా టార్గెట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి తెలంగాణలో పర్యటించారు. దీంతో కేసీఆర్ తనపై చేస్తున్న కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారోనని ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, చంద్రబాబు మాత్రం ఖమ్మంలో జరిగిన సభలో చాలా హుందాగా వ్యవహరించారు. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసినా కూడా కేసీఆర్ను పల్లెత్తు మాట కూడా అనలేదు. కాకపోతే, తనను టార్గెట్ చేయడంపై మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేసారు. తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఈ సభ చూసిన వారందరూ చంద్రబాబు సందర్బోచితంగా స్పందించారని ప్రశంసల కురిపిస్తున్నారు. ఆయన హుందాగా వ్యవహరించిన తీరును కొనియాడుతున్నారు.
బాబు రెండురోజుల పర్యటన సక్సెస్..! మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన..!
ఖమ్మం సభ మహాకూటమిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుందనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా షేరిలింగంపల్లి లో బాబు జరిపిన రోడ్ షోకు అనూహ్య స్పందన వచ్చింది. షేర్ లింగం పల్లి లో జరిగిన మూడు బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు ఎక్కడా సహనం కోల్పోకుండా వ్యవహరించారు. చంద్రశేఖర్ రావు ఆరోపణలకు ప్రత్యారోపణలు చేయకుండా చేసిన అభివ్రుద్దిని ఏకరువు పెడుతూ యువతలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసారు. దీంతో చంద్రబాబు తెలంగాణ పర్యటనలో సంయమనంగా వ్యవహరిండంతో షేర్ లింగం పల్లి పర్యటన ఉద్రిక్తలకు దారితీయకుండా సజావుగా ముగిసింది. అంతే కాకుండా తెలంగాణ లో చంద్రబాబుకు ప్రజలనుండి అనూహ్య స్పందన వస్తోందని భావించిన కాంగ్రెస్ పార్టీ అదనంగా మరికొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేయడం కొసమెరుపు.
అదే స్పూర్తితో మరిన్ని కార్యక్రమాలు..! రెండో విడత ప్రచారానికి రెడీ..!!
రెండు రోజులు తెలంగాణలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శనివారం మరో విడత ప్రచారం చేయనున్నారు. ఈ సారి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాజేంద్రనగర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గణేస్ గుప్తా గెలుపు కోసం చంద్రబాబు శనివారం రోడ్ షో నిర్వహించనున్నారు. రాజేందరనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి కూకటపల్లి నియోజకవర్గం పరిధిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. సుజనా ఫోరం మాల్ నుంచి ప్రారంభమయ్యే చంద్రబాబు రోడ్ షో రాత్రి 8.30 గంటలకు మోతీనగర్ లో ముగుస్తుంది. మధ్యలో జేఎన్టీయూ, కేపీహెచ్బీ కాలనీ, కూకటపల్లి, వై జంక్షన్, మూసాపేటల్లో చంద్రాబాబు ప్రసంగిస్తారు.