దాసరితో పాత విషయాలు మాట్లాడా, నాకు చాలా క్లోజ్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
దాసరి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తనకు ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని, తన కుటుంబ సభ్యుడి మాదిరిగా తనతో ఉండేవారని చెప్పారు. దాసరి త్వరగా కోలుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు.
దాసరి నారాయణ రావు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
దాసరి తనను కూడా ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. శ్వాస తీసుకోవడంలో కొంత సమస్య ఉందని, రెండు రోజుల్లో మామూలు స్థితికి వస్తారని చెప్పారు.
ఆయన తనతో మాట్లాడారని, పాత విషయాలను కూడా చెప్పారని అన్నారు. రెండు రోజుల్లో దాసరి పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. ఆయన వెంటిలెటర్ పైన ఉన్నారన్నది వట్టి పుకారేనని చెప్పారు. చంద్రబాబు అంతకుముందు నందమూరి రామకృష్ణ ఇంట్లో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నారు.