పదవులు సరే, మూణ్ణెళ్లకోసారి సర్వే.. తేడా వస్తే: బాబు, 'తెలంగాణ బాధ్యత మీదే'
హైదరాబాద్: కొత్త, పాత కలయికలతో కమిటీలను వేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు అన్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ కమిటీల ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు మాట్లాడారు.
కొత్త, పాత కలయికలతో పదవులు ఇచ్చామని చెప్పారు. పదవులు ఇచ్చిన వారి పని తీరు పైన మూడు నెలలకు ఓసారి సర్వే చేస్తామని చెప్పారు. కొత్త కమిటీలకు బాధ్యత పెరిగిందన్నారు. 2019లో తెలంగాణలో టిడిపిదే అధికారం అని చెప్పారు.
టిడిపి కార్యకర్తలు తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ అన్నారు. పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నామన్నారు. అనేక వినూత్న కార్యక్రమాలకు నాంది పలికిన పార్టీ టిడిపి అన్నారు. తెలుగు జాతికి న్యాయం చేయాలనే ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
తెలుగువారి భవిష్యత్ కోసం ఎన్నికలకు ముందే ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామన్నారు. తెలంగాణలో తిరుగులేని శక్తిగా టిడిపి అవతరించాలని, ఆంధ్రప్రదేశ్ మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తామని చంద్రబాబు అన్నారు.
మరో మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తిరిగి అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వస్తుందన్న దానిలో ఎంతమాత్రమూ సందేహం లేదన్నారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవాల్సిన బాధ్యత నూతన కమిటీదే అన్నారు.
టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఆ తర్వాత ప్రభుత్వాల పనితీరును ఎండగట్టాలన్నారు. టిడిపి త్యాగాలకు మారుపేరు అన్నారు. చెప్పింది చెప్పినట్టు ఆచరించే పార్టీ తమదే అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వం ద్వారా రూ.55 కోట్లు సమకూర్చుకున్న ఏకైక పార్టీ టీడీపీయేనన్నారు.
ఇతర పార్టీలు తమను అనుకరించాలని చూసి అపహాస్యం పాలయ్యారన్నారు. కార్యకర్తల త్యాగాల వల్లే నేతలకు పదవులు దక్కాయని, ఏవైనా తేడాలు వస్తే అవే పదవులకు వారు దూరమవుతారని హెచ్చరించారు. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నందున ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసేందుకు కార్యకర్తల అండతో కమిటీ సభ్యులు కదలాలన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి: కళా వెంకట్రావు
పార్టీ నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా కృషి చేస్తానని టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. టిడిపిని కార్యకర్తల పార్టీగా తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎప్పుడూ వెన్నంటే ఉంటూ కార్యకర్తల్లో ధైర్యం నింపుతున్నారన్నారు. కార్యకర్తలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలన్నారు.