ఐటీ గ్రిడ్ చంద్రబాబుదే, ఎన్నికల తర్వాత మళ్లీ హైదరాబాదుకే ఏపీ సీఎం: తలసాని
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం నిప్పులు చెరిగారు. ఏపీ ఎన్నికలకు కేసీఆర్ డబ్బులు పంపుతారని చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచడం దేశంలోనే మొదట ప్రారంభించింది చంద్రబాబు అన్నారు. ఆయన తెరాస భవన్లో మాట్లాడారు.
అమాయక ఏపీ ప్రజల్ని చీట్ చేస్తున్నారు
చంద్రబాబు మహానటుడు అని, సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారని, ఎన్నికల్లో డబ్బు పంపిణీ ఆయనతోనే మొదలయిందని తలసాని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రూ.500 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఏపీ ఎన్నికలకు తెలంగాణ సీఎం కేసీఆర్ డబ్బులు పంపుతారని, ఎన్నికల్లో తమకు, తెరాసకు మధ్యే పోటీ అని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం అమాయక ఏపీ ప్రజల్ని చీట్ చేస్తున్నారన్నారు. ఆయన 420 అన్నారు.
అందుకే హెరిటేజ్
ఏపీ ప్రజల డేటా చోరీపై చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రోజుకో మాట మాట్లాడుతున్నారని తలసాని దుయ్యబట్టారు. ఓసారి తమ ప్రభుత్వ డేటా చోరీ చేశారని, మరోసారి, పార్టీ డేటా చోరీ చేశారని అంటున్నారన్నారు. ఎన్నికల కోసం ఏపీ ప్రజలను వంచిస్తున్నారన్నారు. ఎన్నికల అనంతరం ప్రజలకు సున్నం పెడతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును చిత్తుగా ఓడించాలని టీఆర్ఎస్.. ఏపీ ప్రజలకు పిలుపునిస్తోందన్నారు. ఎంతోకాలంగా ఉన్న విజయ డెయిరీకి డబ్బులు రావడం లేదని, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్కు మాత్రం లాభాలు ఎలా వస్తున్నాయో చెప్పాలన్నారు. అక్రమ సంపాదనను సక్రమం ఆర్జనగా చూపించేందుకు హెరిటేజ్ను వినియోగించుకుంటున్నారన్నారు. కన్నతల్లినే మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు.
ఇదీ చంద్రబాబు తీరు
చంద్రబాబే దొంగతనం చేసి పక్కవాళ్లను దొంగాదొంగా అన్నట్లుగా ఆయన తీరు ఉందని తలసాని అన్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఇదేనా చంద్రబాబూ అని నిలదీశారు. నాలుగేళ్లు ఉన్న ఆయన మనవడి పేరు మీద వేల కోట్ల రూపాయలు చూపించిన చరిత్ర ఆయనకు ఒక్కడికే దక్కుతుందన్నారు. ప్రతీ మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తారని, కేంద్రంలో చక్రం తిప్పినా అని చెప్పుకున్న చంద్రబాబు అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారని సూటిగా ప్రశ్నించారు.
మళ్లీ హైదరాబాదుకే చంద్రబాబు
హైదరాబాదులో ఉన్న ఏ ఐటీ కంపెనీ భయపడంలేదని తలసాని అన్నారు. డేటా దొంగిలించి తప్పు చేసింది చంద్రబాబు అని, ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇన్ని రోజులూ ప్రయివేటు కంపెనీ అన్నారని, ఇప్పుడు తనదేనని చంద్రబాబు అన్నారని, దొరికిపోతామనే ఫ్రస్టేషన్లో చంద్రబాబు ఉన్నారన్నారు. టీడీపీ నేతల ఆస్తులు అన్నీ తెలంగాణలో ఉన్నాయని, మేము ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామా అన్నారు. ఏపీకి ఎందుకు వస్తున్నావని చంద్రబాబు తనను అడుగుతున్నారని, అదేమైనా మీ తాతదా.. మేము వస్తామని, కాదనడానికి మీరెవరని, ఏపీలో తమకు బంధువులు ఉన్నారని, మీరు చేసే పనుల వల్ల ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందన్నారు. 18 కేసులపై ఇరవై ఏళ్ల నుంచి స్టేల మీద తిరుగుతున్నారన్నరు. మీరు ఒక్కరే తెలుగోళ్ల కోసం పనిచేస్తున్నారా, మీ వ్యవహారమంతా ఆలీబాబా 40 దొంగల్లా ఉందని మండిపడ్డారు. మీరు ఓడిపోయిన తర్వాత మళ్లీ హైదరాబాదే వస్తారని, అమరావతిలో ఉండలేరని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఇదేనా అన్నారు.