'దాంతో 2019 ఏపీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి, జగన్తో ఎలా ఉండాలో కేసీఆర్కు తెలుసు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తుంటే 2019లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో తెలిసిపోతోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నేత, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సోమవారం అన్నారు.
కేసీఆర్! ఎన్టీఆర్ నుంచి పార్టీ లాక్కున్నప్పుడు పక్కనే ఉన్నావ్, జగన్తో కలువ్: బాబు సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టినప్పటికీ తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి దారుణంగా ఓడిపోయిందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినట్లుగానే నవ్యాంధ్రలోను తెలుగుదేశం పార్టీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.
టీడీపీ ఓడిపోవడం ఖాయం, చంద్రబాబు ఇప్పటి నుంచే సాకులు
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం ఖాయమని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. రాబోవు ఎన్నికల్లోని ఓటమికి చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే సాకులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు వద్ద సమాధానం లేదని చెప్పారు.
చంద్రబాబుకు ముగ్గురు మోడీలు కాదు, ఏపీ ప్రజలు చాలు
తనను ఏపీలో ఎదుర్కొనేందుకు ఢిల్లీలోని నరేంద్ర మోడీ, మిడిల్ మోడీ కేసీఆర్, జూనియర్ మోడీ వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఇలా ముగ్గురు మోడీలు వస్తున్నారని చంద్రబాబు చెప్పడంపై జగదీశ్వర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆయనను ఎదుర్కొనేందుకు ముగ్గురు మోడీలు అవసరం లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలునని చెప్పారు.
బీజేపీతో రాజకీయ సంబంధాలు లేవు
ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతలతో తమ పార్టీ (తెరాస)కు ఎప్పుడు కూడా రాజకీయ సంబంధాలు లేవని జగదీశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. చంద్రబాబు మాత్రం పూటకో విధానంతో ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం కేసీఆర్ గొంగళిపురుగును అయినా ముద్దాడుతానని చెప్పారని తెలిపారు.
జగన్తో ఎలా వ్యవహరించాలో కేసీఆర్కు తెలుసు
2004లో కాంగ్రెస్ పార్టీతో, 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది తెలంగాణ కోసమేనని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీలను ఒప్పించిన ఘనత కేసీఆర్ది అని చెప్పారు. చంద్రబాబే కేసీఆర్ దారిలోకి వచ్చారని, కేసీఆర్ చంద్రబాబు దారిలోకి వెళ్లలేదని చెప్పారు. నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డిలతో ఎలా వ్యవహరించాలో కేసీఆర్కు తెలుసునని చెప్పారు. పక్క రాష్ట్రాలతో సంబంధాలపై కేసీఆర్ పరిణితితో వ్యవహరించారన్నారు.మహారాష్ట్రతో సాగునీటి ఒప్పందం ఒక్కటి చాలు కేసీఆర్ రాజకీయ పరిణితి తెలుసుకునేందుకు అన్నారు.
ఎన్టీఆర్ దించడంలో కేసీఆర్ సూత్రధారి అయి ఉంటే
1995లో ముఖ్యమంత్రి పీఠం నుంచి ఎన్టీఆర్ను గద్దె దించడానికి కేసీఆర్ సూత్రధారి అని చంద్రబాబు ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేయడంపై కూడా జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. ఎన్టీఆర్ను గద్దె దించడంలో కేసీఆర్ సూత్రధారి అయితే అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి అయ్యేవారని చెప్పారు. చంద్రబాబు పాలనలో కేసీఆర్తో పోటీ పడాలన్నారు. ఇకనైనా చంద్రబాబు అబద్దాలు ఆపాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓట్ల కోసం కేసీఆర్ను బూచీగా చూపించాలని అనుకంటే అది చంద్రబాబు తెలివితక్కువతనమే అవుతుందని అన్నారు.