పంతం నెగ్గించుకున్న కేసీఆర్: ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓగా నాన్-ఐఏఎస్
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఏదైనా అనుకున్నారంటే దానిని సాధించే వరకూ నిద్రపోరు. సరిగ్గా అలాంటిదే చేసి తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి తీసుకోనటువంటి సాహాసోపేత నిర్ణయాన్ని తీసుకున్నారు.
లేని సంప్రదాయాన్ని వద్దన్న ఉన్నతాధికారుల వినతిని ఆయన తోసిపుచ్చారు. తాను తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమంటూ తేల్చి చెప్పారు. ఇంతకీ ఏంటీ ఆ నిర్ణయం అని అనుకుంటున్నారా? నాన్-ఐఏఎస్ను ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓగా నియమించారు.
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా పనిచేసి రిటైర్ అయిన చంద్రశేఖర్ను ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈఓగా సీఎం కేసీఆర్ ఇటీవల ఎంపిక చేశారు. అయితే ఇప్పటిదాకా ఆ సంప్రదాయం లేదని, పలు శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన సదరు పోస్టులో ఐఏఎస్ అధికారినే నియమించాల్సి ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఆ ఫైలును సీఎంఓ కార్యాలయానికి తిప్పి పంపారు.
అయితే చంద్రశేఖర్ను సీఈఓగా నియమిస్తూ తాను నిర్ణయం తీసుకున్నానని, తన నిర్ణయమే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. దీంతో చంద్రశేఖర్ను ఆరోగ్య శ్రీ సీఈఓగా నియమిస్తూ ప్రభుత్వం నుంచి మంగళవారం అధికారిక ఉత్తర్వులు వెల్లడయ్యాయి. చంద్రశేఖర్ గతంలో ప్రొఫెసర్గా పని చేసి రిటైరయ్యారు.