కేసీఆర్ స్వరంలో మార్పు.!పదవులపై ఆశ లేదు.!ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సంక్షేమమే లక్ష్యమంటున్న సామా.!
హైదరాబాద్ : తెలంగాణ మలి దశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి, లాఠీ దెబ్బలు తిని, జైలు జీవితం అనుభవించి సర్వం త్యాగం చేసిన నిజమైన ఉద్యమకారులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఎంత వరకు గుర్తింపు లభించిందో స్పష్టంగా కనిపిస్తోందని తెలంగాణ ఉద్యమకారుడు, ప్రయివేట్ ఉద్యోగుల సంఘం అద్యక్షుడు సామా వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డప్పుడు చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు తారక రామారావు ఉద్యమకారుల పట్ల వ్యవహరించిన విధానం, తెలంగాణ సిద్దించిన తర్వాత అవలంభిస్తున్న వ్యవహారాల్లో చాలా వ్యత్యాసం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల చంద్రశేఖర్ రావు, కేటీఆర్ ల నిర్లక్ష్య వైఖరితో విసుగు చెంది తాను పదవిని, పార్టీని వీడుతున్నట్టు సామా వెంకటరెడ్డి ప్రకటించారు.
కారు దిగుతున్న అసలైన ఉద్యమకారులు.. కేసిఆర్ వైఖరిలో మార్పు వచ్చిందన్న సామా
నీళ్లు,నిధులు, నియామకాల నినాదంతో వచ్చిన తెలంగాణలో ఎవరికి న్యాయం జరిగిందో, ఎవరికి అన్యాయం జరిగిందో నిఖార్సైన ఉద్యమకారులు గ్రహించాలన్నారు సామా వెంకట రెడ్డి. తెలంగాణ ఆవశ్యకత గురించి చంద్రశేఖర్ రావు వివరించిన విధానాలకు ఆకర్శితుడనై పద్నాలుగు సంవత్పరాలు తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసానని సామా వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ద్రోహులకు అధికారాలు కట్టబెడుతుంటే చూసి తట్టుకోలేకపోయానన్నారు సామా వెంకటరెడ్డి. తెలంగాణ అసలైన ఉద్యమకారులు వంచనకు గురికాబడ్డారని, తన లాంటి నిఖార్సైన ఉద్యమకారులు ఎంతో మంది మనోవేదనతో కృంగిపోతున్నారని సామా ఆవేదన వ్యక్తం చేసారు.
ఉద్యమకారులకు అన్యాయం జరిగింది.. తెగించి తెచ్చుకున్న తెలంగాణలో గుర్తింపు లేదన్న సామా
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్బవించక ముందునుండి ఉద్యమంలో ఉన్నామన్నారు సామా. నిరుద్యోగంతో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న తెలంగాణ యువత ఆకాంక్షలు నెలవేరాలంటే తెలంగాణ ఏర్పడటం ఒక్కటే లక్ష్యం అన్న చంద్రశేఖర్ రావు అడుగులో అడుగు వేసినట్టు వివరించారు. ఈ ప్రక్రియలో తన ఉద్యోగాన్ని కూడా త్యాగం చేసుకున్నట్టు సామా వివరించారు. తెలంగాణ సిద్దించిన తర్వాత చంద్రశేఖర్ రావు సీఎం ఐన తర్వాత ఆయన వైఖరిలో ఊహించని మార్పు వచ్చిందన్నారు సామా. దశల వారీగా అసలైన తెలంగాణ వాదులకు ప్రాముఖ్యతను తగ్గిస్తూ తెలంగాణ ద్రోహులను చేరదీయడం కలచివేసిందన్నారు సామా వెంకటరెడ్డి. తెలంగాణ ఉద్యమకారులు ప్రస్తుతం చంద్రశేఖర్ రావును కలిసేందుకు కూడా అవకాశం లేకపోవడం శోచనీయమన్నారు.
ప్రైవేట్ ఉద్యోగుల సంఘం సంక్షేమమే ద్యేయం.. పదవులుపై ఆశలు లేవన్న సామా వెంకటరెడ్డి..
అంతే కాకుండా ఉద్యమ సమయంలో కల్వకుంట్ల తారకరామారావు కూడా తమను ప్రతీరోజూ సంప్రదించే వారని, ఉద్యమకార్యచరణ వివరించే క్రమంలో ప్రతి రోజు అందుబాటులో ఉండాలని కోరుకునే వారని వివరించారు సామా వెంకటరెడ్డి. మున్సిపల్, పరిశ్రమల మంత్రిగా పదవిలో ఉన్నప్పుడు ప్రయివేట్ ఉద్యోగుల సమస్యలు, ఉద్యోగ అవకాశాల గురించి ప్రస్దావిస్తే కేటీఆర్ అసహనాన్ని వ్యక్తం చేసారని, దీంతో తీవ్ర నిరాశ, నిస్పృహకు లోనయ్యానని సామా వెంకటరెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు, తారక రామారావులో వచ్చిన వినూత్న మార్పు తనను ఆందోళనకు గురిచేసిందన్నారు సామా.
కాంగ్రెస్ పార్టీలో చేరలేదు.. ప్రైవేటు ఉద్యోగుల మేలు కోసమే బీజేపిలోకి వెళ్తున్నానన్న సామా
తాను ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి మారుతున్నట్టు ప్రచారం జరిగిందని, ప్రైవేటు ఉద్యోగుల సంఘం సమస్యలను వివరించేందుకు జాతీయ నేతలను సంప్రదించే క్రమంలో అప్పటికే ఢిల్లీలో ఉన్న పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డిని సంప్రదించామని, ముందస్తుగా నిర్ణయించుకున్న విలేఖరుల సమావేశం ఉండడంతో తాను అనుకోకుండా ఆ సమావేశంలో రేవంత్ రెడ్డి పక్కన కూర్చోవాల్సి వచ్చింది తప్ప కాంగ్రెస్ లో చేరే ఉద్యేశం లేదన్నారు సామా. ప్రస్తుతం బీజేపి చేరుతున్నది కూడా ప్రైవేట్ ఉద్యోగుల సంక్షేమం కోసం తప్పితే పదవులు ఆశించి కాదన్నారు సామా వెంకట రెడ్డి. ఆదివారం సాయంత్రం తెలంగాణ బీజేపి అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో సామా వెంకట రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు స్పష్టం చేసారు.