పునర్వ్యవస్థీకరణ: కేసీఆర్ కేబినెట్ నుంచి 6గురికి ఉద్వాసన, వీరేనా?
హైదరాబాద్ : మంత్రి వర్గ విస్తరణ దిశగా తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైన నేపథ్యంలో.. కేబినెట్ లో మార్పులు-చేర్పులు తప్పవనే వార్తలు రాజకీయ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న గుసగుసల ప్రకారం, కొత్తవారికి కేబినెట్ లో అవకాశం కల్పించడం కోసం ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న ఆరుగురిని కేబినెట్ నుంచి తప్పిస్తారన్న ఊహగానాలు జోరందుకున్నాయి.
మంత్రివర్గం నుంచి వేటు పడే వారిలో.. మంత్రులు జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, పద్మారావు గౌడ్, నాయిని నర్సింహా రెడ్డి, చందూలాల్, పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణారావు స్థానంలో కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావుకి అవకాశమిస్తారని తెలుస్తోంది.
ఇక కొత్తగా కేబినెట్ లోకి తీసుకోబోయే వారి జాబితాలో.. మంత్రి చందూలాల్ స్థానంలో ఎస్టీ కోటా కింద ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి చోటు కల్పించే అవకాశాలున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మాదేవందర్ రెడ్డికి, వరంగల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కొండా సురేఖకి తాజా మంత్రి వర్గంలో చోటు దక్కుతుందని గులాబీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముందునుండి కేసీఆర్ కి, పార్టీకి నమ్మకస్తుడిగా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్ కి ఈ దఫా మంత్రి పదవి ఖాయమంటున్నారు. గతంలోనే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆయనకు చీఫ్ విప్ పదవితో సరిపెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన సీనియర్ నేత డీ.శ్రీనివాస్ పేరు కూడా కేబినెట్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఆయనకు రాజ్యసభ సీటు దక్కపోతే కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది.
డీ.శ్రీనివాస్ కేబినెట్ లోకి ఎంట్రీ ఇస్తే అదే సామాజిక వర్గానికి చెందిన మంత్రి జోగు రామన్నను కేబినెట్ నుంచి తప్పించే సూచనలున్నాయి. ఇక మరో సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డిని రాజ్యసభకు పంపించాలా..! లేక పార్టీ సేవల కోసమే వాడుకోవాలా..! అనే విషయంలో పార్టీ తర్జనభర్జన పడుతున్నట్టుగా సమాచారం. మొత్తానికి వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.