ఘోరం: చిల్లర అడిగితే చితకబాదారు.. తప్పించుకునే ప్రయత్నంలో లారీ గుద్దేసింది
హైదరాబాద్ లోని హయత్ నగర్ లో దారుణం జరిగింది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి నడుమ తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
హైదరాబాద్: హయత్ నగర్ లో దారుణం జరిగింది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి నడుమ తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలోని పాన్ షాపులో రాజేష్ అనే వ్యక్తి సిగరెట్ కొన్నాడు. సిగరెట్ కోసం కొంత డబ్బు ఇవ్వగా పాన్ షాపు యజమాని.. రాజేష్ కు నాలుగు రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇదే విషయంలో షాపు యజమాని, రాజేష్ కు మధ్య వివాదం తలెత్తింది.
ఈ నేపథ్యంలో పాన్ షాపు యజమాని, అతని స్నేహితులు కలిసి రాజేష్ పై దాడి చేసి చితకబాదారు. దెబ్బలు భరించలేక రాజేష్ వారి నుంచి తప్పించుకునేందుకు రోడ్డు మీదికి పరుగుదీశాడు.
రోడ్డు దాటే ప్రయత్నం చేస్తుండగా అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ లారీ అతడ్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ అధారంగా కేసు నమోదు చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.