రెస్టారెంట్, రోడ్డుపై రియాల్టర్ల రచ్చ, తుపాకీతో బెదిరింపు
హైదరాబాద్: సెటిల్మెంట్ వ్యవహారంలో ముగ్గురు రియాల్టర్లు ఘర్షణకు దిగిన సంఘటన ఆదివారం సాయంత్రం హైదరాబాదులో జరిగింది. హిమయత్ నగర్లోని ఓ రెస్టారెంటులో మొదలైన రచ్చగా మారి, రోడ్డు పైకి వచ్చింది.
సమాచారం మేరకు.. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెస్టారెంటులో కూర్చున్న వ్యక్తి పైకి రివాల్వర్ గురిపెట్టి బెదిరించారు. పోలీసులు గన్తో బెదిరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గౌలిపురలో ఉండే టిపిసిసి కార్యదర్శి కెఎస్ ఆనంద రావు, ఓ మాజీ మంత్రి దగ్గర పీఎస్గా పని చేసిన మూర్తిల మధ్య స్థల వివాదం ఉంది. ఆదివారం సాయంత్రం ఆ విషయం మాట్లాడుకుందామని మూర్తి... ఆనంద రావును హిమాయత్నగర్లోని ఓ రెస్టారెంటుకు పిలిచాడు.
మూర్తి, ఆనంద రావులు మాట్లాడుకుంటుండగా మూర్తి అనుచరుడు దీపక్ రావు అకస్మాత్తుగా తన చేతి సంచి నుంచి రివాల్వర్ తీసి.. మాట వినకపోతే చంపేస్తానని ఆనంద రావును బెదిరించాడు. అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు.
కాసేపటికి తేరుకున్న ఆనంద రావు అక్కడున్నవారి సాయంతో తనపై రివాల్వర్ గురిపెట్టిన దీపక రావును పట్టుకొని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.
దీనిపై ఆనంద రావు మాట్లాడారు. మూర్తి, దీపక్ రావులతో ప్రాణహాని ఉందని, ఇందులో ఓ మాజీ ఎంపీ, అతని కుమారుడి హస్తముందని ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. ఆనంద రావే తమను హిమాయత్నగర్కు రమ్మన్నాడని మూర్తి పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, షేక్ పేట గ్రామ పరిధిలోని వెస్టర్న్ ప్లాజాకు ఎదురుగా 3వేల గజాలను క్వారీ వ్యాపారస్తుడు దీపక్ రావు, పాతబస్తీకి చెందిన ఆనంద రావు, శ్రీనివాస్ రెడ్డిలు కలిసి రూ.1.30 కోట్టతో భూమిని కొనుగోలు చేశారు. వివాదంలో ఉన్న ఈ భూమిని ముగ్గురు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ విషయమై వారి మధ్య గొడవ జరిగింది.