ప్రజల కోసం వస్తే విమర్శలా?: పవన్ కారుపైకి చెప్పు, సభలో గందరగోళం
Recommended Video
ఖమ్మం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖమ్మం పర్యటనలో ఓ చెప్పు కలకలం సృష్టించింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి చెప్పు విసరడంతో అది పవన్ కారు బ్యానెట్పై పడింది. ఓపెన్టాప్ కారులో అభిమానులకు అభివాదం చేసుకుంటూ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
ఆయన వాహనం తల్లాడ సెంటర్కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఆ జన సమూహంలోంచి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. అయితే అది కారు బ్యానెట్పై పడడంతో అభిమానులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. ఇదేమీ లెక్కచేయకుండా పవన్ తన ర్యాలీని కొనసాగించారు.
బాధ్యతాయుతంగానే..
ఈ ఘటన అనంతరం ఖమ్మంలో ఎంబీ గార్డెన్స్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో పవన్ కార్యకర్తలు, నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘నాపై దాడులు చేసినా ఎదురుదాడి చేయను. ప్రజల కోసం ఏమైనా భరిస్తా. మహనీయుల ఆశయాల కోసం బాధ్యతాయుత రాజకీయాలు చేయాలి' అని పవన్ చెప్పారు.
అద్భుతాలు చేస్తామనడం లేదు..
‘జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదు. నాకు కులం, మతం లేదు. మానవత్వం, జాతీయతను గౌరవిస్తా. మన సమాజం కులవ్యవస్థతో ముడిపడి ఉంది. కులవ్యవస్థను కాదని రాజకీయాలను చేయలేము. మెత్తగా మాట్లాడతానని కొందరు అనుకోవచ్చు. ప్రజా ప్రయోజనాల కోసం అవసరమైతే తగ్గుతాను. ఎన్నికల్లో సీట్లు ఇస్తేనే సామాజిక న్యాయం జరగదు. తమ కులం అభివృద్ధి చెందకపోవడంపై నేతలు ఆలోచించాలి. 2019 ఎన్నికల్లో అద్భుతాలు చేస్తామని చెప్పడం లేదు' అని పవన్ అన్నారు.
ప్రజలకు అండగా నిలబడితే విమర్శలా..
‘కార్యకర్తలు సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులు తెలుసుకోవాలి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నన్ను కదిలించింది. ప్రజలకు అండగా నిలబడితే ఎందుకు విమర్శలు చేస్తారో తెలియదు. ఇంతకాలం ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోలేదు? జనసేన కార్యకర్తలు స్థానిక సమస్యలను వెలుగులోకి తేవాలి' అని పవన్ పిలుపునిచ్చారు.
ద్వేషించేవారికి సమయం లేదు
‘సమస్యలపై అధికారపక్షాలను నిలదీయడమంటే తిట్టడం కాదు.. నా జీవితం జనసేన కార్యకర్తలకు అంకితం. నేను పదవులు కాదు.. సామాజిక మార్పు కోరుకుంటున్నా. ప్రేమించేవాళ్లకు తప్ప.. ద్వేషించేవాళ్లకు సమయం ఇవ్వను' అని పవన్ పునరుద్ఘాటించారు.
చివరలో గందరగోళం.. పవన్ ముందుగానే..
కాగా, భారీగా తరలివచ్చిన అభిమానుల్లో కొందరు పవన్ ప్రసంగిస్తున్న సమయంలో వేదికపైకి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మరికొంత సమయం తన ప్రసంగాన్ని కొనసాగించాలనుకున్నా.. పరిస్థితి గమనించిన పవన్, ముందుగానే తన ప్రసంగాన్ని ముగించేశారు. పవన్తో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగుబడటంతో కొంత తోపులాట జరిగింది. పలువురు అభిమానులకు గాయాలయ్యాయి. అంతకుముందు మనం సెల్ఫీలు, ఫొటోలు కోసం రాలేదని, ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడేందుకు వచ్చామని పవన్ అభిమానులకు గుర్తు చేశారు.