నాకింకా పెళ్లి కాలేదు, ఇలా చేస్తే....: డ్రగ్స్ కేసులో చార్మీ వాదన ఇదీ...
డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కునే విషయంలో సినీ నటి చార్మీ కౌర్ అలియస్ సర్దీప్ కౌర్ అనూహ్యమైన మలుపు తీసుకుని వచ్చారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ఆమె హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలసిందే..
హైదరాబాద్: డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కునే విషయంలో సినీ నటి చార్మీ కౌర్ అలియస్ సర్దీప్ కౌర్ అనూహ్యమైన మలుపు తీసుకుని వచ్చారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ఆమె హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలసిందే.
ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు న్యాయవాదితో హాజరుకావడానికి అనుమతించాలని, మహిళా అధికారులతో తనను విచారణ జరిగేల ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా లంచ్ మోషన్లో వినాలని చార్మి తరపు న్యాయవాది విష్ణువర్థన్ రెడ్డి సోమవారం ఉదయం న్యాయస్థానాన్ని కోరారు.
నిరాకరించిన హైకోర్టు...
లంచ్ మోషన్లో చార్మీ వ్యాజ్యాన్ని వినాలని ఆమె తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు నిరాకరించింది. రెగ్యులర్గా పిటిషన్ దాఖలు చేసుకుంటే విచారిస్తామని స్పష్టం చేసింది. తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని చార్మీ తన పిటిషన్లో చెప్పారు.
Recommended Video
జీర్ణించుకోలేకపోతోందని...
తన సినీ ప్రస్థానాన్ని చార్మీ పిటిషన్లో వివరిస్తూ ఒక వర్గం తనకు వస్తున్న గుర్తింపును జీర్ణించుకోలేకపోతోందని చార్మీ తన పిటిషన్లో అన్నారు. తాను ముంబైలో జన్మంచానని, 15 ఏళ్ల ప్రాయంలోనే నీ తోడు కావాలి అనే చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశానని ఆమె చెప్పారు. రెండు నంది అవార్డులు అందుకున్నానని,, సినీ పరిశ్రమలో తనకు వస్తున్న గుర్తింపును ఒక వర్గం జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.
లేనిపోని ఆరోపణలు....
ఒక వర్గం తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దుష్ప్రచారం చేస్తోందని, కొన్ని మీడియా సంస్థలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, చానళ్లు టీఆర్పీ రేటింగ్ పెంచుకోవడానికి తనకు లేనిపోనివి అంటగట్టి ప్రచారం చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. తాను మహిళనని, తల్లిదండ్రులు తనతో లేరని, తనకు సహకరించే స్నేహితులు హైదరాబాద్లో లేరని ఆమె చెప్పారు.
నాకింకా పెళ్లి కాలేదు...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1) కింద న్యాయవాది ద్వారా సహాయం పొందే హక్కు తనకు ఉందని, కుట్రపూరితంగా కేసులో ఇరికించే ప్రశ్నలు వేసి, ఒత్తిడి చేసి చేయని నేరాన్ని అంగీకరింప చేస్తారని భయపడుతున్నానని చార్మీ అన్నారు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, లేని పోని అభాండాలు వేసి ప్రచారం చేస్తే తీరని నష్టం జరుగుతుందని, భవిష్యత్తు, కెరీర్ నాశనమవుతుందని అన్నారు.
భయపెట్టకుండా చూడాలి..
విచారణ సమయంలో తనను భయపెట్టకుండా, తనపై ఒత్తిడి పెట్టకుండా ఉండేందుకు న్యాయవాదిని అనుమతించాలని చార్మీ హైకోర్టును కోరారు. మహిళా అధికారులతోనే విచారణ చేయించాలని ఆమె విజ్జప్తి చేశారు. ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్, సూపరింటెండెండ్ (సిట్)లను ఆమె పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కెల్విన్కు ఏ పాపమూ తెలియదు...
డ్రగ్స్ కేసులో అరెస్టయిన కెల్విన్కు ఏ పాపమూ తెలియదని అతని తరపు న్యాయవాది రేవంత్రావు అన్నారు. అతన్ని అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. టాలీవుడ్తో అసలు పరిచయాలే లేవని చెప్పారు. వాట్సప్ మెస్సేజ్లు, ఫొటోలతో అసలు సంబంధమే లేదని, అవన్నీ నిరాధారమైనవని అన్నారు.