ఉపఎన్నిక: టీడీపీ హుజూర్నగర్ అభ్యర్థిగా చావా కిరణ్మయి
హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని ఖరారు చేసింది.
హుజూర్నగర్ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా చావా కిరణ్మయిని ఖరారు చేసినట్లు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణ ఆదివారం ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఆమెకు పార్టీ నేతలు బీఫారం కూడా అందజేశారు. టీడీపీ గెలుపునకు కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని ఈ సందర్భంగా రమణ పిలుపునిచ్చారు.
తెలంగాణ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి జరిగిందని ఎల్ రమణ్ చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కిరణ్మయిని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించామని తెలిపారు.
ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ.. తన గెలుపునకు హుజూర్నగర్ ప్రజలు సహకరించాలని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై గొప్ప బాధ్యత ఉంచారని అన్నారు. హుజూర్నగర్ గెలుపు నుంచే పార్టీ పూర్వ వైభవం ప్రారంభమవుతుందని కిరణ్మయి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థినే పోటీలో ఉంచగా.. టీడీపీ కూడా మహిళనే బరిలో ఉంచడం గమనార్హం.
కాగా, హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి, బీజేపీ అభ్యర్థిగా కోట రామారావు పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకుంది. తమ పార్టీ అభ్యర్థిని గెలుపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా.. 24న ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని పార్టీలు కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.