బిగిస్తున్న ఉచ్చు: కేశవరెడ్డిపై తెలంగాణలోనూ కేసు
దుండిగల్: కేశవరెడ్డి విద్యా సంస్థల అధినేత కేశవరెడ్డిపై తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం రాత్రి చీటింగ్ కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లిలోని కేశవరెడ్డి పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు 20మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజానికి వీరు నెల రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతున్నా సివిల్ కేసంటూ పెద్దగా పట్టించుకోలేదని సమాచారం. చివరికి బాధితులు శుక్రవారం సాయంత్రం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను కలవడంతో దుండిగల్ పోలీసులు స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలోని బాచుపల్లి, కంది బ్రాంచీల్లో 260మంది విద్యార్థులు కేశవరెడ్డి విద్యాసంస్థల్లో చదువుతున్నారు.
పాఠశాల యాజమాన్యం ఒక్కో విద్యార్థి నుంచి డే స్కాలర్కు రూ.2 లక్షలు, రెసిడెన్షియల్కు రూ.4 లక్షల చొప్పున డిపాజిట్ రూపంలో వసూలు చేశారు. ఒప్పందం ప్రకారం విద్యాసంవత్సరం పూర్తయిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు కోరితే డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లించేలా అంగీకారం కుదిరింది.
అయితే నిరుడు పదో తరగతి పూర్తిచేసిన 16మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికీ స్కూల్ చుట్టూ తిరుగుతున్నా డిపాజిట్ సొమ్మును తిరిగి ఇవ్వడంలేదు. పైగా పాఠశాల ఆస్తులను ధ్వంసం చేసేందుకు వచ్చారంటూ వారిపై ఎదురు కేసులను నమోదు చేయించారు.