సినిమా స్క్రిప్ట్ కే అందని ఐడియాలు..! పెద్దమ్మ ఇంటికే కన్నమేసిన కూతురు..!!
హైదరాబాద్: నగరంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఈజీ మనీ కోసం ముఖ పరిచయం లేని వాళ్లే కాదు స్నేహితులు, రక్త సంబందీకులు కూడా తెగబడిపోతున్నారు. ఇలాంటి సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. తండ్రి, తమ్ముడు అనారోగ్యం పాలవడంతో ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఓ యువతి మంచి ప్లాన్ వేసి..తన పెద్దమ్మ ఇంటికే కన్నం వేసింది. పక్కగా ప్లాన్ వేసి తన స్నేహితుల సాయంతో ఇంట్లో ఉన్నసొమ్ము దొంగిలించేలా ప్రణాళిక రచించింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని రాంనగర్లోని గణేశ్నగర్కు చెందిన పిళ్లా వినయకుమారి తన కుమార్తె కీర్తితో కలిసి అక్కడే నివాసముంటున్నారు. వినయకుమారి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. వినయకుమారికి వరసకు కుమార్తె అయ్యే కుష్బూ అనే యువతి తరచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేది. కుటుంబ పరిస్థితి బాగలేకపోవడంతో...తన పెద్దమ్మ ఇంట్లో చోరీ చేయాలనీ భావించింది. దీనికోసం తన స్నేహితులు సూర్య, వంశీ సాయం తీసుకుంది. ఇంటికి సంబంధించిన దృశ్యాలు, పడకగదిలో ఉండే అల్మారాలు దృశ్యాలను తన మొబైల్లో చిత్రీకరించి వాట్సాప్లో స్నేహితులకు పంపింది.ఈనెల 19న వినయకుమారి ఇంటికి వెళ్లిన కుష్బూ.. నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి పెద్దమ్మతో పాటు ఆమె కుమార్తెకు ఇచ్చింది. కీర్తి ఓ గంటలో నిద్రలేవగా.. వినయకుమారి మాత్రం అపస్మారక స్థితిలో ఉండిపోయింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడే ఉన్న కుష్బూ కూడా ఏమీ తెలియనట్లు వారితోపాటు ఆస్పత్రికి వెళ్లింది. అదేరోజు రాత్రి కీర్తి బ్యాగులోంచి ఇంటి తాళాలు తీసుకున్న కుష్బూ.. సూర్యకు అందజేసింది.
సూర్య, వంశీ కలిసి వినయకుమారి ఇంటికి వెళ్లి నేరుగా పడకగదిలోని బీరువాలో ఉన్న బంగారం, నగదు తీసుకెళ్లారు. తిరిగి యథావిధిగా తాళం వేసి తాళం చెవిని కుష్బూకు అప్పగించారు. కుష్బూ తాళం చెవిని తిరిగి కీర్తి బ్యాగులో పెట్టేసింది. ఈనెల 23న ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన వినయకుమారి, కీర్తి బీరువాలో ఉన్న బంగారం, నగదు కనిపించకపోయేసరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. కుష్బూపై అనుమానంతో ఆమెను ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. ఇక మొత్తం 53.8 తులాల బంగారం, రూ.5.25లక్షల నగదు వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నారు. కుష్బూతో పాటు ఆమెకు సహకరించిన సూర్య, వంశీని పోలీసులు అరెస్ట్ చేసారు.