ఢిల్లీ గ్యాంగ్: అప్పులిస్తామని రూ. 10 కోట్లకు టోకరా
హైదరాబాద్: సెక్యూరిటీ లేకుండానే తక్కువ వడ్డీకే అప్పులిస్తామంటూ అమాయకులను నమ్మించి వారితో తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయించుకొని ఢిల్లీకి చెందిన ఓ ముఠా ఘరానా మోసానికి పాల్పడుతోంది. ఈ ముఠా దేశవ్యాప్తంగా 522 మందిని మోసం చేసి రూ.10 కోట్ల వరకు దోచుకుంది.
హైదరాబాద్లోని ఆజంపురాలో నివాసముండే సయ్యద్ ఖుత్బుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదుతో నగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ ముఠా చేసిన మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు ముగ్గురు ముఠా సభ్యులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.
ఢిల్లీ, హర్యానా రాష్ర్టాల్లో ఈ ముఠా 30 బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి అమాయకుల నుంచి డబ్బులు డిపాజిట్ చేయించినట్లు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎం మహేందర్రెడ్డి తెలిపారు. ఇందులో నుంచి 7 బ్యాంకు ఖాతాలను, రూ.1.51 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్కు చెందిన మహిపాల్ సింగ్ యాదవ్ ముఠా గూగుల్ నుంచి ఫోన్ నంబర్లు తీసుకొని ఫోన్లు చేస్తుంటారు. అవసరమున్న వారికి వడ్డీ తక్కువగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా కోరిన అప్పు ఇస్తామంటారు. ఇది నిజమని నమ్మిన అమాయకులు వారికి కావాల్సిన డాక్యుమెంట్లు పంపిస్తారు.
అనంతరం వీరికి చెందిన ఫైనాన్స్ సంస్థ పేరిట లోన్ అప్రూవల్ అయ్యిందంటూ నమ్మిస్తారు. అనంతరం బ్యాంకులో నగదు నిల్వ ఉండాలని అడిగిన లోన్లో 20 నుంచి 25 శాతం వరకు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయిస్తారు. తరువాత సెల్ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తారు. ఇలా దేశ వ్యాప్తంగా ఈ ముఠా అమాయకులను మోసం చేస్తోంది.
హైదరాబాద్ నగరవాసి ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీకి వెళ్లిన సీసీఎస్ పోలీసులు ఈ ముఠా మోసాన్ని బయటపెట్టారు. ప్రధాన సూత్రధారి మహిపాల్సింగ్ యాదవ్, అతనికి సహకరిస్తున్న విమల్ ఆరోరా, శాంతనుకుమార్లను అరెస్టు చేయగా సందీప్ జునియా, రాకేష్ శర్మలు పరారీలో ఉన్నట్లు కమిషనర్ తెలిపారు.