లోన్ పేరుతో కస్టమర్లకు టోకరా..! సిబిల్ స్కోర్ పెరిగి పర్సనల్ లోన్ వస్తుందని మోసం..!
హైదరాబాద్ : కాదేదీ మోసానికి అనర్హం. డైలాగ్ ఎక్కడో విన్నట్టు ఉంది కదూ..! ఎదుటి వాళ్లను బురిడీ కొట్టించేందుకు, మోసం చేసేందుకు ఎప్పుడూ కొన్ని దుష్ట శక్తులు కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాయి. చేసే మోసం ఒకటే కాని మార్గం వేరుంటుంది. తెలివైన వాళ్లు కూడా అప్పుడప్పుడూ ఇలాంటి కొత్త మోసాలకు, కొత్త అవతారం ఎత్తుతున్న మోసగాళ్లకు చిక్కి సర్వం కోల్పోతుంటారు. తాజా వ్యక్తి గత రుణం పేరుతో కేటుగాళ్లు అమాయక ప్రజానికాన్ని చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. వస్తువు కొందామని షాపుకు వచ్చిన వినియోగదారులకు డబ్బులు, పర్సనల్ లోన్ ఆశచూపి మోసం చేయడం ప్రారంభించాడు ఓ మోసగాడు. నగర శివార్లలో ఉండే మల్లారెడ్డి అనే కిరాణా వ్యాపారి తన షాపుకు వచ్చే వినియోగదారులకే కుచ్చుటోపీ పెట్టేసాదు. వినియోగదారుల ఒకరి ఈఎంఐ కార్డు నుండి మరొకరికి వస్తువులను అమ్మడం ప్రారంభించాడు సదరు కేటుగాడు.
వినియోగదారులకు నమ్మకం కలిగించేందుకు మూడో నెల వరకు ఈఎంఐల డబ్బులను తనే చెల్లించాడు. దీంతో వినియోగదారులు ఈఎంఐ కార్డుదారుల అక్కౌంట్లలో డబ్బులు వేయడం, స్వయంగా కార్డుదారునికే 3, 4 నెలల ఈఎంఐ డబ్బులను ఇచ్చి నమ్మించాడు. అంతటితో ఆగకుండా ఒక్కొక్క కార్డుపై 3 నుంచి 4 వస్తువులు ఈఎంఐలలో విక్రయించడం మొదలుపెట్టాడు. వినియోగదారులు నా కార్డుపై ఎందుకు కొన్నావు అని అడిగితే ఎన్ని వస్తువులు కొంటే అన్ని పాయింట్లు పెరుగుతాయని, సిబిల్ స్కోర్, కార్డు లిమిట్ పెరుగుతుందని, దీంతో ఐదు లక్షల వరకు వక్తిగత రుణం లభిస్తుందని నమ్మబలికాడు.
కార్డుదారులు దాన్ని నమ్మి పర్సనల్ లోన్ డబ్బుల కోసం ఆశపడి అతన్ని నమ్మారు. ఇంతలో 10 రోజుల నుండి షాపు మూసివేసి ఎవరికి కనిపించకుండా వెళ్ళి బిచానా ఎత్తివేశారు. ఈ స్కాం వ్యవహారంలో బాధితులు దాదాపు 60 నుండి 70 మంది ఉంటారని ఒక్కొక్కరి కార్డుతో లక్ష నుండి లక్ష 50 వేల వరకు ఈఎంఐల బకాయిలు ఉంటాయని, మొత్తం 2 నుంచి 3 కోట్ల వరకు ఉంటుందని అనుకుంటున్నారు. యజమాని మల్లారెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినుట్టు సమాచారం.