చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్చల్.. హైదరాబాద్ నుంచి గద్వాల్ షిఫ్ట్
రాష్ట్రంలో చెడ్డీ గ్యాంగ్స్ హల్చల్ చేస్తున్నాయి. బీభత్సం సృష్టించి అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ కే పరిమితమైన చెడ్డీ గ్యాంగ్ దొంగలు ఇప్పుడు పట్టణాలను టార్గెట్ చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గద్వాల్ లో చెడ్డీ గ్యాంగ్ సంచారం స్థానికంగా భయాందోళనలు కలిగించింది.
చెడ్డీ గ్యాంగ్ గద్వాల్ లో సంచరించిందన్న వార్త కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వేణు అపార్టుమెంట్స్ లోకి చొరబడ్డారు దుండగులు. చెడ్డీలు వేసుకుని, ముఖాలకు మాస్కులు ధరించి వచ్చిన ఆరుగురు చోరీకి విఫలయత్నం చేశారు. తొలుత సీసీ కెమెరాలు తొలగించారు. ఆపై అన్నీ అంతస్థుల్లోకి వెళ్లి ఫ్లాట్ల తలుపులు తట్టారు. అయితే ఎవరూ కూడా డోర్లు తీయకపోవడంతో చెడ్డీ గ్యాంగ్ ఆటలు సాగలేదు. పైగా ఏ ఇంటికి కూడా తాళం వేసి లేకపోవడంతో దొంగలకు కలిసిరాలేదు. దీంతో వచ్చిన దారినే ఖాళీ చేతులతో వెనుదిరిగారు. సొమ్ము దోచుకోవడమే గాకుండా వ్యక్తులపై దాడులు చేయడం చెడ్డీ గ్యాంగ్ సభ్యులకు అలవాటు. ఈనేపథ్యంలో ఎవరైనా తలుపులు తీసినా, ఇంటికి తాళాలు వేసి ఉన్నా.. చెడ్డీ గ్యాంగ్ రెచ్చిపోయేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
చెడ్డీ గ్యాంగ్ గద్వాల్ లోకి ప్రవేశించిందన్న విషయం వైరల్ గా మారడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. కొత్త వ్యక్తులు కనిపించినా గానీ, ఎవరిపైనా అనుమానం ఉన్న గానీ వెంటనే సమాచారం అందించాలని కోరుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ సంచారంపై దృష్టి పెడతామని తెలిపారు.