యూటీగా హైదరాబాద్..అక్కడితో ఆగదు: లిస్ట్ పెద్దదే: ఒవైసీ: ఆదాయం కోసమేనా?
హైదరాబాద్: హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు సాగించే అవకాశాలు లేకపోలేదని, వాటిని ఇప్పుడే అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటూ అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర విభజన సమయంలో వినిపించిన ఈ వాదనలు.. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ పుట్టుకుని రావడం చర్చనీయాంశమౌతోంది.
నిండు లోక్సభలో అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యమేమిటనేది తేలాల్సి ఉంది. రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే కార్యక్రమానికి బీజేపీ ప్రభుత్వం.. జమ్మూ కాశ్మీర్తో ఆరంభించిందని, అది అక్కడితో ఆగబోదని ఒవైసీ హెచ్చరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ను కూడా యూటీగా మార్చేస్తారంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ జాబితాలో హైదరాబాద్తో పాటు బెంగళూరు, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, లక్నో ఉన్నాయని పేర్కొన్నారు.
దశలవారీగా ఆయా నగరాలన్నింటినీ మోడీ ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చే అవకాశాలు లేకపోలేదంటూ ఆయన ముందుస్తు హెచ్చరికలను జారీ చేశారు. అసద్ చేసిన వ్యాఖ్యలు, వ్యక్త పరిచిన ఆందోళనల వెనుక కారణాలు లేకపోలేదని, అత్యదిక ఆదాయాన్ని ఆర్జిస్తోన్న నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టవచ్చనే వాదనలు వినిపిస్తోన్నాయి.
ఎన్నికల ఎఫెక్ట్ మరి: చెన్నైపై నిధులు గుమ్మరింత: వేల కోట్లు: డిస్కవరీ క్యాంపస్
ఒవైసీ నోట వెలువడిన ఆయా నగరాలన్నీ ఆదాయపరంగా బంగారు గుడ్డును పెట్టే బాతుల్లాంటివేని, రికార్డు స్థాయిలో పన్నుల రాబడిని నమోదు చేస్తోన్నవేనని గుర్తు చేస్తున్నారు. వస్తు, సేవల పన్ను రూపంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధిక ఆదాయాన్ని కేంద్రానికి అందిస్తున్నాయని, ఈ కారణంతో వాటిని యూటీగా మార్చే అవకాశాలను కొట్టి పారేయలేమనే వాదనలు ఉన్నాయి.