పౌరసత్వం రద్దు: చెన్నమనేని రమేష్కి హైకోర్టులో ఊరట: అసలేం జరిగింది?
హైదరాబాద్: టీఆర్ఎస్ నేత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్కు హైకోరటులో ఊరట లభించింది. ఆయన పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేసింది.
భారీ షాక్: ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్దు
చెన్నమనేని పౌరసత్వం రద్దు చేస్తూ..
మోసపూరిత విధానాల ద్వారా చెన్నమనేని రమేష్ భారతీయ పౌరసత్వం పొందినట్లు ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. భారత పౌరసత్వం చట్టం-1955లోని సెక్షన్ 10 ప్రకారం చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
నిబంధనలు ఉల్లంఘించారంటూ..
తాను ఎటువంటి నేరపూరిత కార్యక్రమాల్లో పాల్గొనలేదంటూ అఫిడవిట్లో రమేష్ పేర్కొనడంపైనా హోంశాఖ ఘాటుగా స్పందించింది. రమేష్ పౌరసత్వం చెల్లదంటూ 2009లో ఆయనపై పోటీ చేసిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. భారత పౌరసత్వ చట్టం నిబంధనలను రమేష్ ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. హైకోర్టును కూడా ఆశ్రయించడంతో.. కేంద్ర హోంశాఖ పరిధిలో ఈ విషయం ఉందని రమేష్ కోర్టుకు తెలిపారు.
మొదటిసారి 2017లో రద్దు..
ఈ విషయాన్ని తేల్చేందుకు కోర్టు ఆదేశాల మేరకు 2010లో ఎస్కే టాండన్ నేతృత్వంలో హోంశాఖ త్రిసభ్య కమిటీని నియమించింది కేంద్రం. తన తల్లిదండ్రులు స్వాతంత్ర్య సమరయోధులని.. తాను జర్మనీలో విద్యాభ్యాసం చేశానని, 1993లో జర్మనీ పౌరసత్వం పొందానని కమిటీ ముందు రమేష్ తన వాదనలు వినిపించారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న కమిటీ ఆయన పౌరసత్వం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో 2017లో హోంశాఖ చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని రద్దు చేసింది. దాన్ని సవాల్ చేస్తూ రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విషయాన్ని తేల్చాల్సింది హోంశాఖనేనంటూ కోర్టు ఈ ఏడాది జులై ఆదేశాలు జారీ చేసింది.
16న తేలనున్న భవితవ్యం..
హైకోర్టు ఆదేశాలతో 2019, అక్టోబర్ 31న ఇరుపక్షాలు తమ వాదనలను హోంశాఖ ముందు వినిపించాయి. వాదనలు విన్న హోంశాఖ.. చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు చేస్తూ నవంబర్ 20న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రమేష్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ, చట్ట విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు. భారత పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 10(3)లోని అంశాలను పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేయాలంటూ జూన్ 10న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోలేదన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయం తీసుకుందన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. చెన్నమనేని రమేష్కు ఊరటనిస్తూ కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. డిసెంబర్ 16న మరోసారి హైకోర్టు విచారించనుంది.