టీఆర్ఎస్కు షాక్: కాంగ్రెస్లో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, దుబ్బాక అభ్యర్థిగా బరిలోకి?
హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దిగజారుడు రాజకీయాలు..
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ముత్యం రెడ్డి ఆదర్శ నాయకుడని, ఆయన కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను స్వాగతిస్తున్నామన్నారు. రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా దిగజారిపోయాయని, ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతోనే డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. డబ్బు, మద్యం ఎవరు పంపిణీ చేసినా ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకే వేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ ఎన్నికలే తెలంగాణ భవిష్యత్
దుబ్బాక ఉపఎన్నికలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు సహకరించాలని కార్యకర్తలకు సూచించారు. ఎన్నికలను ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని ఉత్తమ్ హెచ్చరించారు. బుధవారం నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దుబ్బాకలోనే ఉంటానని అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక కేవలం ఒక అభ్యర్థి ఎన్నిక మాత్రమే కాదని, తెలంగాణ భవిష్యత్కు సంబంధించినదని ఉత్తమ్ తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా కల్వకుంట్ల కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
దుబ్బాక కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి!
టీఆర్ఎస్ సర్కారు వందల కోట్ల అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలు టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో చేరిన చెరుకు శ్రీనివాస్ రెడ్డినే దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీలు దుబ్బాకలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. మంత్రి హరీశ్ రావు, టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో కలిసి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు నియోజకవర్గం చుట్టేస్తున్నారు.