చెస్ట్ ఆస్పత్రి ఘటన బాధాకరం, సాయం చేసేందుకు సిద్ధం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
చెస్ట్ ఆస్పత్రిలో రోగి చనిపోయిన ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. వెంటిలేటర్ తీసేశారని రోగి సెల్ఫీ తీసి తండ్రికి వీడియో పంపించారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలైంది. తనకు ఊపిరి ఆడటం లేదు అని రోగి అనడం బాధాకరమని ఆయన అన్నారు. ఘటనపై ప్రభుత్వ చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నానని తెలిపారు.
కరోనా వైరస్ మెట్రో నగరాల విజృంభిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అంగీకరించారు. హైదరాబాద్ సహా చెన్నై, ముంబైలోనై కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్లో వైరస్ వ్యాప్తికి గల కారణాలను కేంద్రబృందం అధ్యయనం చేస్తుందని తెలిపారు. లవ్ అగర్వాల్ నేతృత్వంలో టీమ్.. గాంధీ ఆస్పత్రి, టిమ్స్, ఒక కంటైన్మైంట్ జోన్లలో పర్యటిస్తున్నారని వివరించారు.
కరోనా వైరస్ గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేసేందుకు కేంద్రమంత్రిగా తనవంతుగా ప్రయత్నం చేస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీగా రాష్ట్రానికి హెల్ప్ చేసేందుకు ముందుంటానని తెలిపారు. మెడికల్ సెంటర్గా ఉన్న హైదరాబాద్లో కరోనా వైరస్ కేసులు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు.