అనంతగిరికి చెస్ట్ ఆసుపత్రి: కేసీఆర్పై ఆగ్రహం, ధర్నా
హైదరాబాద్: ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్లోని అనంతగిరి టిబి ఆస్పత్రి ఆవరణకు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎర్రగడ్డ ఆస్పత్రిని అనంతగిరి టిబి ఆస్పత్రికి తరలించి, అక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టడానికి రూ.7.70 కోట్లు మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు మంగళవారం నుంచి ఆందోళన బాట పట్టారు. ఛాతీ ఆస్పత్రిని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పారా మెడికల్ సిబ్బందితో పాటు వైద్యులు, ఉద్యోగులు మంగళవారం ఆస్పత్రి ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
చెస్ట్ ఆసుపత్రిని వికారాబాద్ తరలించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకున్న విషయం తెలిసిందే. ఎర్రగడ్డలో చెస్ట్ ఆసుపత్రి, మానసిక వ్యాధుల ఆస్పత్రి పక్కపక్కన ఉన్నాయి. ఈ రెండు ఆస్పత్రులు ప్రస్తుతం 120 ఎకరాల విస్థీర్ణం కలిగి ఉన్నాయి. ఈ రెండు ఆస్పత్రులను వికారాబాద్కు తరలించి ఎర్రగడ్డ ఆసుపత్రిని సచివాలయంగా, పరేడ్ మైదానంగా, ప్రభుత్వ కార్యాలయాల సముదాయంగా నిర్మించాలని కేసీఆర్ ప్రతిపాదించారు.
ఆ దిశగా అధికారులు కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ఛాతీ ఆస్పత్రిని వికారాబాద్లోని అనంతగిరికి తరలిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎర్రగడ్డలో పరేడ్ మైదానాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. రాజధానిలో ప్రస్తుతం పెద్ద మైదానం సికింద్రాబాద్లో పరేడ్ మైదానం ఒక్కటే ఉంది.
ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏదైనా సభ నిర్వహించాలంటే రక్షణశాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి వచ్చిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండలో నిర్వహించారు. అక్కడ కూడా ఉత్సవాలను నిర్వహించాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి అవసరం అయింది.
హైదరాబాద్లో ఉన్న ఈ రెండు చారిత్రక స్థలాలు కూడా రక్షణశాఖ ఆధీనంలో ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేలా పరేడ్ మైదానాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు హైదరాబాద్లో అందుబాటులో ఉన్న ఏకైక పెద్ద విస్థీర్ణంలో ఉన్న స్థలం చాతీ, మానసిక ఆస్పత్రుల ఆవరణలోనే ఉన్నట్టు రెవిన్యూ శాఖ ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చింది.
అయితే, చెస్ట్ ఆసుపత్రిని ఎక్కడో వికారాబాదులో ఏర్పాటు చేయడమేమిటని సిబ్బందితో పాటు పలువురు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఛాతి ఆసుపత్రిని తరలించేందుకు ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయిస్తామని ఆసుపత్రి ప్రమాణాల కమిటీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్రలలోని పలు ప్రాంతాల వారికి ఇక్కడ ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు.