మేడారం జాతరకు నేడు ఛత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్
మేడారం: ప్రసిద్ద గిరిజన జాతర మేడారంలో తొలి ఘట్టం పూర్తైంది.మేడారం కన్నెపల్లినుంచి సారక్క మేడారం గద్దెకు చేరుకోవడంతో తొలిఘట్టం పూర్తయింది. మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారక్కకు స్వాగతం పలికారు. మేడారం జాతరలో వనదేవతలను దర్శించుకొనేందుకు ఛత్తీస్ఘడ్ సీఎం రమణసింగ్ గురువారం నాడు మేడారం రానున్నారు.
జవనరి 31వ, తేది రాత్రి పూట సారక్క మేడారం పయనం ఈసారి చాలా పొద్దుపోయాక మొదలైంది. రాత్రి 8.12 గంటలకు కన్నెపల్లి గుడి నుంచి సారక్క మేడారం బయల్దేరింది. 8.45 గంటలకు కన్నెపల్లి వాడవాడలా సారక్కకు మంగళహారతులు పట్టారు. 9.20కి కన్నెపల్లి ఊరు సారక్కను సాగనంపింది. 9.35 గంటలకు సారక్క జంపన్నవాగుకు చేరుకుంది. 9.40గంటలకు వాగునుంచి బయటికి వచ్చిన సారక్కకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మొక్కులు చెల్లించుకున్నారు. 10.05 గంటలకు మేడారం గుడికి సారక్క చేరుకుంది.
గురువారం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క గుట్టదిగి వచ్చి భక్తుల నీరాజనాలు అందుకుంటుంది. ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య సమ్మక్క తల్లిని గద్దెపై రాత్రి సుమారు 9గంటల ప్రాంతంలో ప్రతిష్ఠించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచే సమ్మక్క పూజారులు ఐదుగురు చిలుకలగుట్టపైకి వెళ్లి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కతల్లిని వెంటతీసుకొని చిలుకలగుట్ట చివరి మూలమలుపుకాడికి వస్తారు.
అక్కడ జిల్లా కలెక్టర్ కర్ణన్, జిల్లా ఎస్పీ భాస్కరన్ సమ్మక్క తల్లికి స్వాగతం పలికి ఏకే 47తో తూటాలు పేల్చిన తరువాత సమ్మక్కతల్లి గుట్ట దిగుతుంది. ఫిబ్రవరి రెండో తేదిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కెసిఆర్, మేడారంకు రానున్నారు. వనదేవతలను సందర్శించుకోనున్నారు.