వామ్మో.. ఏంటీ ఈ విపరీతం..!అమాంతం పెరిగిన ధర..!కిలో చికెన్ మరీ అంత రేటా..?
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఏది జరిగినా విచిత్రంగా జరిగిపోతుంటుంది. ఏదైనా పరిణామం చోటుచేసుకుంటే జనాలకు పిచ్చిపుట్టే రేంజ్ లో పరాకాష్టగా జరిగిపోతుంటుంది. ఒక్కోసారి టమాటాలు కిలో వంద రూపాయల ధర వరకూ వెళ్లి సామాన్యులకు దడ పుట్టిస్తుంటాయి. అలాగే అమాతం ధర పడిపోయి ఐదు రూపాయలకు కిలో చొప్పున అమ్మే సందర్బాలు కూడా చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి కొనుగోలు లేక రోడ్ల మీద అర్దాంతరంగా పారబోయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర పరిణామాలు తరుచుగా చోటుచేసుకుంటాయి. ఇదే సందర్బం ఇప్పుడు కోడి కూరను ఆవహించింది.
అమాంతం పెరిగిన చికెన్ ధరలు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న కోడిమాంసం ప్రియులు..
తాజాగా చికెన్ ధర కూడా ఇలాంటి పరిణామాలనే తలపిస్తోంది. కరోనా క్లిష్ట సమయంలో కిలో కేవలం 100రూపాయలు పలికిన చికెన్ ధర కేవలం 15రోజుల్లో వంద రూపాయల పైనే పెరిగిపోయింది. అసలే స్వీయ నియంత్రణ పాటిస్తున్న జనాలకు తినే తిండిలో అనేక రుచులనే ఆస్వాదించలనే కోరికలు కలుగుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులు కూడా కాస్త గరిటతిప్పడంలో ప్రయోగాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రయోగాలకు కావల్సింది కూడా సులభంగా తయారు చేసే చికెన్ ఐటమే. అందుకు చికెన్ ధర నగరంలో విపరీతంగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది.
కరోనా కారణంగా తగ్గిన ధరలు.. రెండు మూడు వారాల్లోనే విపరీతంగా పెరిగి చికెన్ ధర..
కరోనా కారణంగా గత రెండు మూడు వారాల క్రితం వరకూ చికెన్ వైపు కన్నెత్తి చూసిన నాథుడు లేడు. అంతే కాకుండా కరోనా భయంతో నిన్న మొన్నటివరకూ ఎవరూ చికెన్ తినేవారు కాదు. కనీసం పెంచుకున్న కోడిని ఉచితంగా ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు లేవు. దాంతో చికెన్ వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు, కరోనా సమయంలో కూడా శుబ్బరంగా చికెస్ తినొచ్చు అని వైద్యులు చెప్పడంతో నగరంలో మళ్లీ చికెన్ అమ్మకాలు పెరిగాయి. నెమ్మది నెమ్మదిగా హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు విపరీతంగా పెరిగిపోతుయాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే చికెన్ ధర రెండొందల మార్క్ ను దాటిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
కిలో చికెన్ రెండొందల పైనే.. ఆవేదన వ్యక్తం చేస్తున్న చికెన్ ప్రియులు..
హైదరాబాద్ నగరంలో చికెన్ ధరలు చూసి కోడి మాంసప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా కారణంగా నిన్న మొన్నటివరకూ చికెన్ తినాలంటే గజగజలాడిపోయారు నగర వాసులు. చికెన్ వినియోగం ద్వారా కరోనావైరస్ వస్తుందని అపోహతో చాలా వరకు చికెన్ కు దూరంగా ఉన్నారు. అయితే చికెన్పై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు సెలబ్రిటీలు, వైద్యులు కూడా అవగాహన పెంచడంతో, చాలా మంది చికెన్ తినేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఇది గమనించిన దుకాణాదారులు విపరీతంగా రేట్లు పెంచేశారు. గత నెల రోజుల క్రితం కిలో చికెన్ కేవలం యాభై నుండి అరవై రూపాయలకే లభించేది. కానీ ప్రస్తుతం కిలో చికెన్ 200 రూపాయల నుండి 220 రూపాయల వరకూ అమ్ముతున్నారు.
Recommended Video
జీహెచ్ఎంసీ జోక్యం చేసువాలి.. ధరలు నియంత్రించాలంటున్న ప్రజలు..
కాగా నగరంలోని పలు ప్రాంతాల్లో 15 రోజుల క్రితం చికెన్ ధర 120రూపాయలు ఉండగా, ప్రస్తుతం 80 రూపాయలనుండి 100రూపాయల ధర అందనంగా పెరిగింది. దీంతో హైదరాబాద్ నగరంలో కిలో 220లకి కూడా అమ్ముతున్నారు వ్యాపారులు. నగరంలో ఒకేసారి పెంచిన చికెన్ ధరలతో వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు. కరోనా నుంచి ఉపశమనం పొందేందుకు చికెన్ తింటుంటే, వ్యాపారులు మాత్రం కరోనా వైరస్ను కుంటిసాకుగా చూపిస్తూ ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని చికెన్ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మటన్ ధరలు పెరినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు రంగప్రవేశం చేసి కట్టడి చేసారు. ఇప్పుడు చికెన్ ధరల అంశంలోకూడా నగరపాలక సంస్థ అధికారులు చొరవ తీసుకుని అధిక రేట్లను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.