తల కొట్టేసినట్టే!: ఆ ఎమ్మెల్యేకు కేసీఆర్ ఫోన్, 'బతుకమ్మ చీర'డ్యామేజ్పై
బతుకమ్మ చీరల పంపిణీపై ఆరా తీయగా.. చీరల పంపిణీ ప్రశాంతంగానే కొనసాగుతోందని అజయ్ ఆయనకు బదులిచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పార్టీకి పెద్ద డ్యామేజ్ అయి కూర్చుంది. నాసిరకం చీరలంటూ జనం వాటిని తగలబెట్టడంతో ప్రభుత్వానికి తల కొట్టేసినంత పనైంది.
టీఆర్ఎస్ పరువు గంగ పాలు: బతుకమ్మ చీరలకు నిప్పు..
మహిళలు చీరలను తగలబెడుతూ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనికి తోడు నాన్ బెయిలబుల్ కేసులంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. ఇప్పుడు మరింత డ్యామేజ్ చేసేలాగే కనిపిస్తోంది.
మరోవైపు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునేందుకు స్వయంగా సీఎం కేసీఆరే రంగంలోకి దిగారు. ఆయా ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఖమ్మం ఎమ్మెల్యే అజయ్కుమార్కు కేసీఆర్ మంగళవారం ఫోన్ చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ చీరల పంపిణీపై ఆరా తీశారు. చీరల పంపిణీ ప్రశాంతంగానే కొనసాగుతోందని అజయ్ ఆయనకు బదులిచ్చారు. మహిళలంతా సంతోషంగా చీరలను తీసుకుంటున్నారని చెప్పారు.
ఇదిలా ఉంటే, చీరల కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పష్టత రాలేదు. 50శాతం చీరలను సూరత్ నుంచి తూకం లెక్కన కొనుగోలు చేసి తీసుకొచ్చారని, రూ.50, రూ.60విలువ చేసే చీరలను అంటగట్టారని చెబుతున్నారు. సమయం ఎక్కువగా లేకపోవడం వల్ల నేతన్నలు కోటి చీరలు అందించే పరిస్థితి లేకపోవడంతో ఇలా వేరే ప్రాంతాల నుంచి కొనుక్కొచ్చారన్న వాదన ఉంది.
ప్రభుత్వం మాత్రం అలాంటిదేమి లేదని కవర్ చేసుకునే ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరగడంతో.. దీని వెనుక అసలు కారకులెవరో కనుక్కునే పనిలో పడింది టీఆర్ఎస్ సర్కార్.