సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. సుఖ,సంతోషాలతో పండుగ జరుపుకోవాలని..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం సంపన్నంగా, ధనవంతంగా, ఆనందంతో తులతూగాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు శాంతి, ఆనందంతో జీవించాలని సీఎం భగవంతుడిని ప్రార్థించారు. పండుగను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి, మన ప్రత్యేకమైన కళలకు సంక్రాంతి పండగ ప్రతీక అని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి గత 19 నెలలుగా రైతన్నల సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. ఇక మీదట కూడా ఇదే విధానం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం(జనవరి 13) భోగితో తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభం కానున్నాయి. భోగభాగ్యాలు అందించే పర్వదినంగా భోగి ప్రసిద్ది. ఈ పర్వదినాన ఇంటిల్లిపాదీ తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించి.. భోగి మంటలు వెలిగిస్తారు. ఇదే రోజు పిల్లలకు భోగిపండ్లు కూడా పోస్తారు. తద్వారా వారికి సూర్య భగవానుడి అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు.