ఉప్పల్ నరబలి: తెరపైకి కొత్త అనుమానం.., ఫోరెన్సిక్ ల్యాబ్కు చిన్నారి తల భాగం!
హైదరాబాద్: ఉప్పల్ నరబలి కేసులో నిందితులెవరో గుర్తించినప్పటికీ.. బలైపోయిన ఆ చిన్నారి ఎవరన్నది మాత్రం ఇంతవరకూ తేలలేదు. చిన్నారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?.. కిడ్నాప్ చేశారా?.. లేక డబ్బు ఆశజూపి కొనుక్కొచ్చారా?.. అన్న విషయాలపై స్పష్టత లేకుండా పోయింది. చిన్నారి విషయంలో నిందితుల నుంచి సరైన వివరాలు లభ్యం కాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ను ఆశ్రయించనున్నారు.
Recommended Video
ఉప్పల్ నరబలి: వెలుగులోకి మరిన్ని సంచలనాలు.. ఆర్నెళ్లుగా వాళ్లతో టచ్లో రాజశేఖర్?
ఫోరెన్సిక్ టెస్టులు
బలిచ్చిన చిన్నారి లింగ నిర్దారణ విషయం కూడా ఎటూ తేలలేదు. శాస్త్రీయంగా శిశువు లింగ నిర్దారణపై ఫోకస్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ టెస్టుల ద్వారానే నిజాల్ని రాబట్టాలని భావిస్తున్నారు. ఇందుకోసం చిన్నారి తల వెంట్రుకలు, తల భాగంలోని ఒక ముక్క, రక్త నమూనాలను ల్యాబ్కు పంపించిబోతున్నట్టు తెలుస్తోంది.
పాతబస్తీలో కిడ్నాప్?.. మరో అనుమానం:
జగిత్యాల జిల్లాకు సమీపంలోని ఒక గిరిజన తండా నుంచి బాలికను కొనుగోలు చేసి తీసుకొచ్చారన్న ప్రచారం జరిగినప్పటికీ.. అందులో నిజానిజాలెంతన్నది తేలలేదు. గతేడాది నవంబర్లో పాతబస్తీ నుంచి చిన్నారిని కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మిస్సింగ్ కేసులపై ఫోకస్
చిన్నారి ఎవరన్నది తేలకపోవడంతో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని మిస్సింగ్ కేసులను సైతం పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరైనా పేద దంపతులే చిన్నారిని విక్రయించారా?.. లేక కిడ్నాప్ చేసి తీసుకొచ్చారా?.. అన్నది కీలకంగా మారనుంది. మిస్సింగ్ కేసులు పెట్టిన పలువురు తల్లిదండ్రులను కూడా పిలిపించి పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.
మరో రెండు మూడు రోజుల్లో..
చిన్నారిని ఎవరన్న దానికి సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. విచారణ చాలా వేగవంతంగా జరుగుతోందని, త్వరలోనే అన్ని వివరాలను ఆధారాలతో సహా బయటపెడుతామని అంటున్నారు. ప్రస్తుతం నిందితులంతా పోలీసుల అదుపులోనే ఉన్నారు.