"ఎనిమిదేళ్ల చిన్నారులతో సైతం వ్యభిచారం.."
హైదరాబాద్ : గ్లోబలైజేషన్ వికృత పరిణామాలకు దేశంలోని ఎంతోమంది ఆడపిల్లలు బలవుతున్నారు. పోర్న్ మార్కెట్ పరిధి విస్తరించడం, కొత్త కొత్త థీమ్స్ పేరిట చైల్డ్ సెక్స్ లాంటి బాలల హక్కులకు విఘాతం కలిగించే చర్యలకు ఆయా పోర్న్ కంపెనీలు, వ్యభిచార కూపాలు పూనుకోవడం వల్ల దేశంలో ఆడపిల్లల సంరక్షణ ప్రశార్థకంగా మారింది.
ఇలాంటి ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి సునితా కృష్ణన్. ఆడపిల్లల అక్రమ రవాణాపై ఆమె రూపొందించిన ఓ డాక్యుమెంటరీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దేశంలో ఆడపిల్లల రక్షణ గురించి సునితా కృష్ణన్ మీడియాతో మాట్లాడారు.
ఎనిమిదేళ్ల పిల్లలను సైతం వ్యభిచార కూపాల్లోకి తరలిస్తు వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలు, ఇందుకోసం సాంఘీక సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలు, గ్రామీణ ప్రాంతాల వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రేమ పేరుతో, సినిమా అవకాశాల పేరుతో, ఉద్యోగం చూపిస్తామన్న ఆశ చూపుతూ ఎంతోమంది ఆడపిల్లలను అక్రమ రవాణా చేస్తున్నారన్నారు.
ఏటా ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది అక్రమ రవాణా ముఠాల చేతిలో చిక్కుకుపోతున్నారని, అందులో 45 శాతం మంది ఆడపిల్లలు ఉండడం విచారకరం అన్నారు. ఎనిమిదేళ్లు, పదేళ్లు, పదిహేనేళ్ల పిల్లలను వ్యభిచార కూపంలోకి లాగుతూ పసిప్రాయంలోను చిన్నారుల జీవితాలను నరకప్రాయం చేస్తున్నారని తెలియజేశారు.
ఆడపిల్లల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రజ్వల స్వచ్ఛంధ సంస్థ నడుం బిగించిందని, ఆడపిల్లల సంరక్షణే ధ్యేయంగా సంస్థ పనిచేస్తోందని, యూఎస్ కాన్సులేట్తో కలిసి ఇందుకోసం సంయుక్త కార్యచరణ రూపొందిస్తుమన్నారు. గత రెండు దశాబ్దాల్లో తమ సంస్థ ద్వారా 16 వేల మందికి పునరావాసం కల్పించామన్నారు.
ఆడపిల్లల రక్షణే ధ్యేయంగా ఈ ఏడాది జనవరి 9న స్వరక్షా పేరుతో రవీంద్రభారతి నుంచి చైతన్యరథాన్ని ప్రారంభించామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లో 53 జిల్లాలు, 15,600 కిలోమీటర్లు, 165 రోజుల పాటు పర్యటించిందని, భువనేశ్వర్లోని రవీంద్ర మండప్ ప్రాంతంలో ఈ నెల 22న పర్యటన ముగిసిందని చెప్పుకొచ్చారు.
పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 480 అవగాహన, జాగృత కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆయా జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆడపిల్లల బాధలు విని సుమారు 40 మంది అక్రమ రవాణ బ్రోకర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తాము చేసిన తప్పుడు పనులకు పశ్చాత్తాప్పడ్డారని, ఆ అమ్మాయిల జీవితాలను నాశనం చేశామని ఒప్పుకున్నారని, తమను శిక్షించాలని వేడుకున్నారని తెలిపారు. ప్రతి ఆడపిల్లకు విద్యాబుద్దులు తప్పనిసరిగా నేర్పించాలన్నారు.