బడికి దూరమవుతున్న బాల్యం ..పదేళ్ళలో మూడు లక్షల మంది డ్రాపవుట్స్
తెలంగాణా రాష్ట్రంలో చిన్నారుల అందమైన బాల్యం బడికి పోకుండా బుగ్గిపాలు అవుతుంది. పాఠశాల విద్యార్థుల డ్రాపవుట్స్ ఆందోళన కరంగా మారాయి. గత పదేళ్లలో 3లక్షల 7వేల 232 మంది విద్యార్థులు బడి మానేసినట్లు గా అధికారుల అంచనా. అధికారిక లెక్కల ప్రకారం 2008- 2009 సంవత్సరములో 8,25,686 మంది ఒకటో తరగతిలో ప్రవేశం పొందారు. 2017- 18లో వారంతా పదో తరగతికి వచ్చేసరికి 5,18,454 కు ఆ సంఖ్య తగ్గింది. అంటే గత పదేళ్లలో 37.21 శాతం మంది డ్రాపవుట్ రేటు నమోదయింది. ఇది నిజంగా రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న అంశం.
తెలంగాణా విద్యాశాఖ సంచలన నిర్ణయం...ప్రైవేట్ విద్యాసంస్థల ప్రక్షాళన.. అర్హత లేని వారిపై వేటు
బడికి పోని చిన్నారుల వివరాలు .. బాలికాల కంటే బాలుర డ్రాప్ అవుట్స్ ఎక్కువ
డ్రాప్ అవుట్ అవుతున్న వారిలో బాలికల కన్నా బాలురు ఎక్కువగా ఉన్నారు అంటే అతిశయోక్తి లేదు. బాలికల డ్రాప్ అవుట్ రేటు 36.3 6 శాతం ఉండగా, బాలుర డ్రాప్ అవుట్ రేటు 38.02 గా ఉంది. ఇక రాష్ట్రంలోని 22 జిల్లాల్లో డ్రాప్ అవుట్ రేటు చూస్తే 30 శాతానికి పైగా ఉంది. ఇందులో అత్యధికంగా కొమరం భీం జిల్లాలో 65.27 శాతం నమోదవగా, అత్యల్పంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 11.52 శాతం నమోదైంది. ఇంత దారుణంగా గత పదేళ్ల మూడు లక్షల పైచిలుకు గా విద్యార్థులు బడి మానేసి, అసలు వారు ఏం చేస్తున్నారు అన్న వివరాలు విద్య శాఖ వద్ద లేకపోవడం గమనార్హం.
పదేళ్ళలో మూడు లక్షలకు పైగా డ్రాప్ అవుట్స్
2008-09లో 4,24,197 మంది బాలురు, 4,01,489 మంది బాలికలు ప్రవేశం పొందారు. 2018-19లో పదో తరగతి వచ్చేసరికి 2,62,969 మంది బాలురు, 2,55,525 మంది బాలికలు మాత్రమే మిగిలారు. ఇక ఎస్సీ విద్యార్థుల్లో డ్రాప్ అవుట్ రేటు 36.44 కాగా, ఎస్టీ విద్యార్థుల డ్రాప్అవుట్ రేటు ఏకంగా 59.21 కావడం గమనార్హం. 2008-09లో 65,020 మంది ఎస్టీ బాలురు.. 61,969 మంది ఎస్టీ బాలికలు ఒకటో తరగతిలో ప్రవేశం పొందగా, 2018-19లో పదో తరగతికి వచ్చే సరికి ఆ విద్యార్థుల సంఖ్య బాలురు 27,031కి, బాలికలు 24,772కు తగ్గింది .
డ్రాప్ అవుట్ అవుతున్న వారిని బడి బాట పట్టించే ప్రయత్నం చెయ్యని విద్యా శాఖ
చదువు మానేసిన వీరంతా పని చేస్తున్నారా? ప్రస్తుతం వీరంతా ఏం చేస్తున్నారు? అనే వివరాలు అధికారులు స్వీకరించాల్సిన అవసరం ఉంది. బడిమానేసిన విద్యార్థుల సంఖ్యను వెల్లడించడమే కానీ వారు బడి మానేయడానికి గల కారణాలేంటి? బడి మానేసిన పిల్లలు అందరూ ఏం చేస్తున్నారు? తిరిగి వాన్ని బడికి రప్పించడానికి తీసుకున్న చర్యలేంటి ? అనేవి మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో పలక బలపం పట్టాల్సిన చేతులు బడికి దూరమవుతున్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే బడి మానేస్తున్న చిన్నారులు ఏ కారణంతో బడి మానేశారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్న విషయాలను తెలుసుకొని తిరిగి వారిని బడిబాట పట్టించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అన్ని రంగాల్లో ముందుకు నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ప్రతి రంగంలోనూ ప్రగతి సాధిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, విద్యారంగంలో వెనుకబాటుతనానికి గురవుతుందని ప్రస్తుతం పాఠశాల విద్య లో ఉన్న డ్రాప్ అవుట్స్ తెలియజేస్తున్నాయి.