ఇంటర్ బోర్డును కోర్టుకీడ్చిన బాలల హక్కుల సంఘం
హైదరాబాద్ : విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ఇంటర్ బోర్డుపై ఆగ్రహం పెల్లుబికుతోంది. తప్పుల తడకల ఫలితాలు ఇవ్వడంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. విద్యార్థులకు జరిగిన అన్యాయానికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం నేత అచ్యుతరావు పిటీషన్లో కోరారు.
ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పుల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని బాలల హక్కుల సంఘం ఆరోపిస్తోంది. ఇందుకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అచ్యుతరావు పిటీషన్లో కోరారు. పిటీషన్ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం విచారణ జరపనుంది.
ఇంటర్ జవాబు పత్రాలు గల్లంతుకాలేదు, బోర్డు కార్యదర్శి అశోక్
ఇంటర్ పరీక్షల మూల్యాంకనం, ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయంటూ మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇంత రచ్చ జరగుతున్నా ఇంటర్ బోర్డు కార్యదర్శి మాత్రం ఎలాంటి పొరపాట్లు జరగలేదని ప్రకటించారు. మరోవైపు ప్రభుత్వం నియమించిన కమిటీ సైతం అవకతవకలు జరగలేదని ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలో విద్యార్థులను వేదనకు గురిచేసిన ఇంటర్ బోర్డుపై బాలల హక్కుల సంఘం కోర్టు మెట్లెక్కింది.