చైనా హవాలా మాయ..జుట్టు ఎగుమతి చేస్తే ఏకంగా రూ .82లక్షలు..అవాక్కయ్యారా?
ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా యువతను ఆకర్షించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన చైనా కంపెనీలు ఇప్పుడు ఆ డబ్బును హవాలా మార్గంలో పంపేందుకు పక్కా స్కెచ్ తో ముందుకు వెళుతున్నాయి. భారతదేశం నుండి ఇనుము, వెండి ,జుట్టు ,ఆయుర్వేద మందులు, విడిభాగాల వంటివి చైనా అవసరాలకు తగ్గట్టుగా ఎగుమతి అవుతున్నాయి. అయితే అక్కడ దిగుమతి చేసుకుంటున్నవీటికి సంబంధించి కంపెనీలు చెల్లించాల్సిన సొమ్మును హవాలా మార్గంలో చెల్లిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది .
Recommended Video
ఏపీ తెలంగాణా రాష్ట్రాల్లో చైనా ఎగుమతిదారుల ఖాతాల్లో హవాలా సొమ్ము
ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న డోకి పే, లింక్ యున్ సంస్థలు చెల్లించడంతో ఇది హవాలా సొమ్మే అని పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చి ఈ హవాలా సొమ్ము ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హవాలా దందా కొనసాగిస్తున్న డోకి పే, లింక్ యున్ సంస్థలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలామంది చైనాకి సంబంధించిన ఎగుమతులను పంపిస్తున్న వారి ఖాతాలోకి కోట్లాది రూపాయల నగదు జమ చేశాయి. ఇక తాజాగా ఒక విషయం వెలుగులోకి రావడంతో ఈ హవాలా వ్యవహారం గుట్టురట్టయింది.
జుట్టు సేకరించి పంపిన వ్యక్తి ఖాతాలో 82లక్షల రూపాయలు
క్షౌర శాలల నుండి జుట్టును సేకరించి తరచూ చైనాకు పంపుతున్న ఒక డీలర్ కు అతని ఖాతాలో ఏకంగా 82 లక్షలు జమయ్యాయి. చాలా కాలంగా చైనా కంపెనీలకు జుట్టు పంపిస్తున్న అతనికి ,జుట్టు నాణ్యత ఆధారంగా చైనా కంపెనీలు డబ్బు పంపుతున్నాయి. అయితే డోకి పే , లింక్ యున్ సంస్థల లావాదేవీలను పరిశీలిస్తున్న పోలీసులకు ఎల్బీ నగర్ కు చెందిన సదరు డీలర్ ఖాతాలో జమ అయిన ఎనభై రెండు లక్షల రూపాయలు అనుమానానికి కారణమయ్యాయి.
నేరుగా కాకుండా డోకిపే, లింక్ యున్ సంస్థల ద్వారా నగదు బదిలీ
జుట్టు పంపించిన వ్యక్తికి సంస్థ నేరుగా డబ్బులు చెల్లించకుండా, చైనా లోని మరొక సంస్థలో ఆ డబ్బులను డిపాజిట్ చేసింది. ఇక అక్కడి నుండి డోకిపే, లింక్ యున్ సంస్థలకు సమాచారం అందింది. ఈ రెండు సంస్థలు సదరు వ్యక్తులకు హవాలా ద్వారా వచ్చిన డబ్బును బదిలీ చేస్తున్నట్లుగా గుర్తించారు. హవాలా మార్గంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీకాకుళం ,విజయవాడ ,రాజమండ్రి ,కరీంనగర్లోని కంపెనీలకు, వ్యక్తులకు నగదు బదిలీ జరిగింది .కోట్లాది రూపాయల నగదు వీరి ఖాతాల్లో వచ్చి చేరింది.
హవాలా డబ్బును వైట్ మనీగా మార్చే ప్లాన్ ...ఇండియన్స్ ఖాతాల్లోకే హవాలా మనీ
డోకి పే, లింక్ యున్ సంస్థలు ఇంకా ఎంతమంది ఖాతాల్లోకి ఇలా నగదు బదిలీ చేశారు అన్నదానిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తానికి చైనా కంపెనీలు రంగులు చెప్పండి.. లక్షలు గెలవండి అంటూ ఆన్లైన్ బెట్టింగ్ వేసి యువతను ఆకట్టుకుని రెండు వేల కోట్ల వరకు కొల్లగొట్టి ఇప్పుడు ఆ డబ్బును వైట్ మనీగా మార్చుకోవడం కోసం పక్క స్కెచ్ వేశారు . ఇండియా నుండి చైనాకు ఎగుమతులు నిర్వహించే కొన్ని సంస్థలను గుర్తించి వారి ఎగుమతులకు, డబ్బు చెల్లించవలసిన సంస్థతో ఒప్పందం చేసుకున్న హవాలాదారులు, సదరు సంస్థ చెల్లింపులు చేయకుండా ఇండియా నుండి వచ్చిన ఎగుమతులకు సంబంధించిన నగదు హవాలా సొమ్ము చెల్లింపు చేయడం గుర్తించారు. ఇక ఈ హవాలా సొమ్ము రవాణాకు డోకి పే , లింక్ యున్ సంస్థలు కీలకంగా పని చేస్తున్నట్లు గా గుర్తించారు.ప్రస్తుతం ఈ సంస్థలపై దర్యాప్తు జరుగుతుంది .