సాగర్ ఒడ్డున టవర్: 85 శాతం ఇస్తామన్న చైనా కంపెనీ, రాధాకృష్ణ! ఖబడ్దార్: అడ్వోకేట్ జెఏసి
హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అతిపెద్ద టవర్ నిర్మాణ వ్యయంలో 85 శాతం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. దుర్గం చెరువు పైన సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి హైవే కన్సల్టెన్సీ ముందుకు వచ్చింది.
తెలంగాణ సీఎం కెసిఆర్ను శుక్రవారం నాడు చైనా పారిశ్రామికవేత్తలు కలిశారు. ఈ సందర్భంగా వారు వంతెనలు, బహుళ అంతస్తుల భవనాల పైన పెట్టుపడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. అలాగే, పాలమూరు ఎత్తిపోతల టన్నెళ్లను అతి త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
రాధాకృష్ణా ఖబడ్దార్: అడ్వొకేట్ జేఏసీ
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పైన తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ మండిపడింది. రాధాకృష్ణ సీఎం కేసీఆర్పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్పై అబద్దాల రాతలు రాస్తున్నారన్నారు.
ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. సూర్యున్ని పట్టుకోవాలని చూస్తే రాధాకృష్ణ మాడి మసైపోతారన్నారు.
సీఎం కేసీఆర్పై రాసే అబద్దాల వార్తలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాధాకృష్ణ సీఎం కాలి గోటికి సరిపోడన్నారు. సీఎంపై పిచ్చి రాతలు రాస్తే తెలంగాణ న్యాయవాదులు, ప్రజలు చూస్తూ ఊరుకోరని, తగిన గుణపాఠం చెబుతారన్నారు.